కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఎఫ్ఆర్బీఎం రూపంలో యత్నిస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని శాసనమండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. రాష్ట్రాలను ఆస్థిర పరిచేందుకు, బలహీన పరిచేందుకు, సంక్షేమ పథకాలు నిలిచిపోయేలా కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం శ్రీలంకలా మారుతుంది అనే కామెంట్స్ బీజేపీ నేతలు చేయడం దురదృష్టకరమన ఆయన మండిపడ్డారు. అధికారం కోసం కేంద్రం అడ్డదారులు తొక్కుతోందని, కొన్ని శక్తులు కులాల పేరుతో అధికారంలోకి రావడానికి యత్నిస్తున్నారు ఇది సాధ్యం కానేకాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఒక్క కులం ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురాదని, కేసీఆర్ వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందని, ఇంకెవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందరూ అధికారం కోసం గుంటనక్కలా కాచుకొని కూర్చున్నారని, విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు.