Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్‌ను మారుతుందా..?

  • దక్షిణాదిలో బంగారం అంటే ఎమోషన్..!
  • పెళ్లిళ్లు, పండుగలు.. గోల్డ్‌కు భారీ డిమాండ్
  • మోదీ విజ్ఞప్తితో మార్కెట్లో కలకలం
  • బంగారు సెంటిమెంట్ మారుతుందా..?
Gold

Gold

Gold Demand : దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పాటు దేశ ప్రజలు ఎవరూ బంగారం కొనవద్దని ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక ద్రవ్యం ఖర్చవకుండా, రూపాయి విలువ తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ పిలుపునిచ్చారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అటు గోల్డ్ మార్కెట్, ఇటు స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే, భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, అదొక భావోద్వేగం. ఈ నేపథ్యంలో ప్రధాని విజ్ఞప్తిని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దక్షిణ భారతదేశం.. బంగారానికి అసలైన చిరునామా
దేశం మొత్తం మీద చూస్తే ఉత్తర, మధ్య భారత దేశాల కంటే దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనే బంగారానికి డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం బంగారు నిల్వల్లో దాదాపు 40 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ బంగారం కొనుగోలు అనేది కేవలం సంపదను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. అక్షయ తృతీయ, ధంతేరస్ వంటి పండుగలే కాకుండా, ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని కొనడం ఇక్కడ ఒక ఆనవాయితీ.

పెళ్లిళ్లలో ‘బంగారు’ పాత్ర
దక్షిణ భారత వివాహాల్లో బంగారం ఒక కీలకమైన ఆస్తిగా మారుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కేరళలో ఒక వధువు సగటున 320 గ్రాముల బంగారం ధరిస్తుండగా, తెలుగు రాష్ట్రాలు , తమిళనాడులో ఇది 300 గ్రాముల వరకు ఉంటుంది. వివాహ సమయంలో ఇచ్చే ఈ బంగారం వధువుకు భవిష్యత్తులో ఒక ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. భారతదేశం ఏటా సుమారు 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది అంటే, అందులో సింహభాగం దక్షిణ భారత వివాహాలకే వెళ్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

నమ్మకమైన పెట్టుబడి, భద్రత
సాధారణ ప్రజలకు స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్ల మీద అవగాహన లేకపోయినా, బంగారం మీద మాత్రం అపారమైన నమ్మకం ఉంటుంది. కంటికి కనిపిస్తూ, ఇంట్లోనే భద్రంగా ఉండే ఈ ఆస్తిని కష్టకాలంలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చని లేదా బ్యాంకుల్లో పెట్టి రుణం పొందవచ్చని పేద, మధ్యతరగతి కుటుంబాలు భావిస్తాయి. ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం భారతీయ మహిళల వద్దే ఉందని, ముఖ్యంగా దక్షిణ భారత ఇళ్లలో ఇది ఒక ‘అదనపు మూలధనం’లా పనిచేస్తుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతుంటారు.

బలమైన మార్కెట్ వ్యవస్థ
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి నగరాలు దేశంలోనే అతిపెద్ద బంగారు వర్తక కేంద్రాలుగా ఎదిగాయి. ఇక్కడ ఆభరణాల తయారీలో ఉండే వైవిధ్యం, పోటీ తత్వం , ఓడరేవులకు దగ్గరగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడం వంటి అంశాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దక్షిణ భారతీయులు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ, రేటు కొంచెం తగ్గినా వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం, దిగుమతులు
భారతదేశం తన అవసరాల కోసం స్విట్జర్లాండ్, యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ దిగుమతుల విలువ సుమారు 72 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ ధనం బయటకు వెళ్లడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, శతాబ్దాల కాలంగా సంప్రదాయం , ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న ఈ ‘బంగారు బంధాన్ని’ సామాన్య ప్రజలు ఒక ఏడాది పాటు పక్కన పెడతారా లేదా అన్నది వేచి చూడాలి.