Kidnapping: సికింద్రాబాద్‌ లో బాలుడి కిడ్నాప్ కలకలం.. బెగ్గింగ్ మాఫియా పనేనా?

Boye Kidnap Secendrabad

Boye Kidnap Secendrabad

Kidnapping: హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా జోరుగా సాగుతోంది. ఒంటరిగా కనిపించే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసి బలవంతంగా భిక్షాటన చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు అపహరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే బాలుడిని బెగ్గింగ్ మాఫియా కిడ్నాప్ చేసిందా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలాపురానికి చెందిన దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడు శివ సాయితో కలిసి తిరుమలకు వెళ్లాడు. ఈ నెల 28న తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ రోజు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేష్ అలసిపోయి స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో 1వ నంబర్‌ ప్లాట్‌ఫారమ్‌లో బ్యాగులతో పాటు కుమారుడిని వదిలి వాష్‌రూమ్‌కు వెళ్లాడు దుర్గేష్. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. కంగారు పడిన దుర్గేష్ స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. కానీ బాలుడి మానసిక పరిస్థితి బాగా లేదని దుర్గేష్ చెప్పాడు.

అయితే రైల్వే స్టేషన్‌లో దుర్గేష్‌, అతని కుమారుడి కదలికలను గమనించిన వ్యక్తులే ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ వెనుక మరాఠా బెగ్గింగ్ మాఫియా హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. పిల్లల ప్రతి కదలికలను కనిపెడుతూ ఉండాలని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు.
Malla Reddy: అట్లుంటది మల్లారెడ్డితో.. మరోసారి డీజే స్టెప్పులతో ఇరగదీసిన మంత్రి