Falcon Scam : ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పురోగతి సాధించింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన ఒక విమానాన్ని ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రూ. 3 కోట్లకు హాకర్ 800A విమానం విక్రయం
ఫాల్కన్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్ 800A’ (Hawker 800A) చార్టర్డ్ విమానాన్ని ఈ-వేలంలో రూ. 3 కోట్లకు విక్రయించారు. అయితే ఈ ప్రైవేట్ విమానం ధర రూ.14 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. అయితే.. జూలై 1న ఎంఎస్టీసీ (MSTC) సంస్థ ద్వారా ఈడీ ఈ ఆక్షన్ ప్రక్రియను నిర్వహించింది. పీఎంఎల్ఏ (PMLA) అడ్జుడికేటింగ్ అథారిటీ ముందస్తు అనుమతితోనే అధికారులు ఈ విమానాన్ని వేలానికి ఉంచారు. కాగా, ఈ విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల మొత్తాన్ని ఈ స్కామ్లో నష్టపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీజ్
ఫాల్కన్ పోంజీ కేసులో ప్రధాన నిందితుడైన అమర్దీప్ కుమార్కు ఈ చార్టర్డ్ విమానం చెందుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2025 మార్చి 7న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఈడీ అధికారులు దీనిని అటాచ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
రూ. 792 కోట్ల భారీ మోసం
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (Fake Invoice Discounting) పేరుతో నిందితులు భారీ మోసానికి తెరలేపారు. అమర్దీప్ కుమార్ అండ్ గ్యాంగ్ దాదాపు రూ. 792 కోట్ల మేర బాధితులను నమ్మించి, పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ భారీ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆస్తుల గుర్తింపు, నిధుల మళ్లింపుపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

