Drug Syndicate : తెలంగాణలో కల్తీకల్లు, ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్వర్క్పై తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Eagle Force) , బోధన్ పోలీసులు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన భారీ అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్ను మట్టుబెట్టడమే కాకుండా, డ్రగ్స్ వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 15 మంది కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ.6 కోట్ల ఆస్తుల జప్తు.. ఫ్యాక్టరీలు, భూములు సీజ్
డ్రగ్స్ ద్వారా వచ్చిన నల్లధనంతో కూడబెట్టిన ఆస్తులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం సెక్షన్ 68(F) ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితులకు చెందిన 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ప్లాట్లతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలు , మహారాష్ట్రలోని కేమికల్ ఫ్యాక్టరీని అధికారులు జప్తు చేశారు. ప్రభుత్వ లెక్కింపు ప్రకారం వీటి విలువ రూ.2.5 కోట్లు కాగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కల్తీకల్లు వికటించి తీవ్ర అస్వస్థత.. వెలుగులోకి దందా
ఉమ్మడి నిజామాబాద్, మెదక్ , సిద్ధిపేట జిల్లాల్లో కల్తీకల్లుకు ఆల్ప్రాజోలం కెమికల్ వినియోగిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నస్రుల్లాబాద్లో కల్తీకల్లు తాగి 68 మంది, గాంధారి ప్రాంతంలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ అంతర్రాష్ట్ర దందా వెలుగులోకి వచ్చింది. సిద్ధిపేటలో కల్తీకల్లుపై మూడు కేసులు నమోదు కాగా, జహీరాబాద్ లో నిఘా పెట్టి 750 గ్రాముల ఆల్ప్రాజోలం, రూ.7.50 లక్షల నగదుతో పాటు క్రెటా కారును అధికారులు సీజ్ చేశారు.
మహారాష్ట్ర సతారాలో తయారీ కేంద్రం ధ్వంసం
బోధన్ పరిధిలో జరిపిన మెరుపు దాడిలో రూ.25 లక్షల విలువైన 2.5 కిలోల ఆల్ప్రాజోలం, ఒక కారు, రూ.25 లక్షల నగదు , 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన కీలక ఆధారాల ఆధారంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చేరుకున్న పోలీసులు ‘సూర్య ప్రభ ఫార్మా కెమ్’ (Surya Prabha Pharma Chem) ఫ్యాక్టరీపై దాడి చేశారు. అక్కడ అక్రమంగా తయారు చేస్తున్న 30 కిలోల ఆల్ప్రాజోలంతో పాటు రూ.12 లక్షల నగదు , సుమారు రూ.4 కోట్ల విలువైన కెమికల్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఒక్క ఆపరేషన్లోనే 32.5 కిలోల ఆల్ప్రాజోలం నిల్వలను పోలీసులు రికవరీ చేశారు. డ్రగ్ వ్యాపారం చేస్తూ అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని, వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేస్తామని ఈగల్ ఫోర్స్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

