తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. జూన్ 25 నుంచి ఆగష్టు 10 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముసాయిదా జాబితా విడుదలకు ముందు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సర్వే ద్వారా 2,64,87,213 మంది (78.30%) నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు.
పరిశీలనలో 9,22,229 మంది (2.73%) మరణించినట్లు, 57,46,803 మంది (16.99%) శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అధికారులకు అందుబాటులో లేరని గుర్తించారు. అలాగే 6.70 లక్షల (1.98%) మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నట్లు తేలింది. సరైన వివరాలు అందించకపోవడంతో 32.2 లక్షల ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు.
ఓటర్ల నమోదు కోసం బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించారు. ప్రక్రియ సౌలభ్యం కోసం 368 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మొత్తం కేంద్రాల సంఖ్య 36,353 కి పెరిగింది. సరిగ్గా వివరాలు నమోదు కానటువంటి వారు, 2002 వివరాలతో అనుసంధానం కాని వారికి ERO ల ద్వారా నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆగష్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఓటు కోల్పోయిన వారు, కొత్తగా నమోదు చేసుకునే వారు Form-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓటరు నమోదు, సమాచార సవరణ, ఇతర సేవల కోసం ఎన్నికల కమిషన్ అందిస్తున్న డిజిటల్ పోర్టల్ https://voters.eci.gov.in/ ద్వారా దరఖాస్తులను పరిశీలించుకోవచ్చు.

