సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం బాబులు భారీగా చిక్కారు. వారాంతపు రోజుల్లో రోడ్లపై ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 196 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 140 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 41 కార్లు, 13 ఆటోలు , ఇద్దరు భారీ వాహన చోదకులు కూడా ఉన్నారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పట్టుబడిన వారిలో 157 మంది శరీరంలో ఆల్కహాల్ శాతం 36 నుండి 200 మిల్లీ గ్రాముల మధ్య ఉండగా, 13 మందిలో అత్యంత ప్రమాదకరమైన 301 నుండి 550 మిల్లీ గ్రాముల మోతాదు నమోదైందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ వెల్లడించారు.
MP Imran Masood: “పార్లమెంట్లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను”.. ఎంపీ ఇమ్రాన్ సంచలన ప్రకటన..
మద్యం సేవించి వాహనం నడిపేవారిపై ఇక నుంచి పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించనున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, మద్యం మత్తులో వాహనం నడిపి ఎవరి ప్రాణాలకైనా ముప్పు కలిగిస్తే కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణహాని కలిగించే తీవ్రమైన నేరమని, పట్టుబడిన వారందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించాలని, కేవలం మత్తు కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.
కోర్టులు కూడా డ్రంక్ డ్రైవింగ్ కేసులపై కఠినంగా స్పందిస్తున్నాయి. గత వారంలో (ఫిబ్రవరి 09 నుండి 14 వరకు) కోర్టులు సుమారు 212 కేసులను పరిష్కరించగా, అందులో ఆరుగురికి జైలు శిక్షతో పాటు సోషల్ సర్వీస్ చేయాలని తీర్పునిచ్చాయి. మిగిలిన 206 మందికి భారీ జరిమానాలు విధించాయి. పట్టుబడిన వారి వివరాలను రికార్డుల్లో భద్రపరుస్తామని, ఇది భవిష్యత్తులో వారి పాస్పోర్ట్ వెరిఫికేషన్ , ఉద్యోగ ప్రయత్నాలపై కూడా ప్రభావం చూపుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. వీకెండ్స్లో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
