CS Sanjay Jaju : కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

  • తక్కువ వర్షపాతం జిల్లాలపై ప్రత్యేక దృష్టి
  • ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
  • తాగునీరు, ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
  • పాఠశాల మౌలిక వసతులు మెరుగుపర్చాలని సూచన
Cm Sanjay Jaju

Cm Sanjay Jaju

CS Sanjay Jaju : రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు శనివారం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, విద్యా శాఖల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన, తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షభావ పరిస్థితులను అధిగమించేందుకు జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని, దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా జరిగేలా గట్టి నిఘా ఉంచాలని, పంటల వైవిధ్యం (క్రాప్ డైవర్సిఫికేషన్) పై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజారోగ్యం, తాగునీరు , విద్యా వసతులపై ప్రత్యేక శ్రద్ధ

ఇదే సమయంలో కాలానుగుణ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరని సీఎస్ స్పష్టం చేశారు. పారిశుధ్యం, దోమల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతూనే, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కొరత లేకుండా సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటశాలలకు అనువైన స్థలాలను గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాధాన్యతా అంశాలన్నింటినీ కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, నిరంతర సమీక్షలు జరపాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.