NTV Telugu Site icon

KCR Maharashtra Tour: నేడే మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. పర్యటన వివరాలు

Cm Kcr

Cm Kcr

KCR Maharashtra Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేడు, రేపు (26,27) తేదీల్లో అంటే రెండు రోజులు ఉంటుంది. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం షోలాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

షోలాపూర్‌కు చెందిన భగీరథ్ బాల్కే అనే స్థానిక నాయకుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. షోలాపూర్‌లోని కొందరు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు (27) మంగళవారం ఉదయం పండరీపూర్, షోలాపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి విఠోభరుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్‌లో రానున్నారు.

కేసీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు మహారాష్ట్రలో పర్యటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న నాందేడ్, మార్చి 14న కంధర్ లోహాలో బహిరంగ సభలు నిర్వహించగా.. మే 19న మరోసారి నాందేడ్ లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదని ప్రజలు ఆలోచించేలా అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల జూన్ 15న నాగ్‌పూర్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. త్వరలో ఔరంగాబాద్‌, పుణెలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
Harish Rao: రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు మెడిసిన్ ఎగుమతి చేస్తాం