CM KCR Wishes Ganesh Chaturthi To Telangana People: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి – జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడ్ని హిందువులు ఆరాధిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను ఈ పండుగ మనకు నేర్పుతుందని చెప్పారు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ.. శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్థించారు.
కాగా.. తెలంగాన రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా.. ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా.. ట్రాఫిక్ దగ్గర నుంచి ప్రజల దాకా, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అనుకోకుండా ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే.. అప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా సహాయక సిబ్బందుల్ని ఆయా ప్రధాన ప్రాంతాల్లో మోహరిస్తున్నారు.