CM KCR Praised CLP Leader Mallu Bhatti Vikramarka at TS Assembly Budget Sessions.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు.. మన బడిపై చేసిన వ్యాఖ్యాలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే యువ నాయకులు సభలో ఉన్నారన్నారు. సభలో చర్చ బాగా జరగాలని, బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం అన్న అభిప్రాయం దేశంలో ఉందని, బడ్జెట్లో పస లేదు… అని ఎదుటోల్లు అనడం ఆనవాయితీ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘భట్టి గారు మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు.. భట్టి గారికి ఈ సారి ఓ మంచి మాట చెప్పారు.. భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి.. పార్లమెంట్ కి పంపాలి’ అని అన్నారు. కేంద్రం విషయాలు ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారని, అందుకే పార్లమెంట్ కి పంపాలి అంటున్నామన్నారు.
అప్పులు కాదు… వనరుల సమీకరణ గా చూడాలని, కరప్షన్ అనిచివేశామని, రైతు బంధులో 50 వేల కోట్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. సంస్కార వంతమైన ఆర్ధిక క్రమశిక్షణలో తెలంగాణ ఉందని, మనకంటే ఎక్కువ అప్పులు తెచ్చే రాష్ట్రాలు ఉన్నాయని, అప్పులు తీసుకోవడంలో మనం 25వ స్థానంలో ఉన్నామన్నారు. అప్పుల విషయంలో ఆందోళన అక్కర లేదని, బలమైన కేంద్రం, బలిహీన రాష్ట్రం ఉండాలన్నది ఇప్పటి వాళ్ళ ఆలోచన అని, ఇది అప్రజాస్వామిక చర్య అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం అనే ధోరణి ఇప్పటి కేంద్రం చేస్తుందని, దుర్మార్గ ఆలోచన ఇది అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం పనితీరు కంటే…మనమే మెరుగ్గా ఉన్నామని, దేశం అప్పు 152 లక్షల కోట్లు అని, రాష్ట్రానికి 25 శాతం అప్పుల పరిమితి విధించారని, రాష్ట్రంకి పెట్టిన పరిమితి కేంద్రంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.
