Site icon NTV Telugu

CM KCR: మీ అందరికీ చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే

Kcr Public Garden

Kcr Public Garden

మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని అన్నారు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని అన్నారు సీఎం. యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ జాతీయ స‌మైక్యతా వ‌జ్రోత్సవాల వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్రజ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. దేశం, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుందని సీఎం పేర్కొన్నారు.

మానవ సంబంధాలనే మంట గలుపుతుందని మండిపడ్డారు. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులన్నారు. ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్‌.

అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలని సీఎం పేర్కొన్నారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని తెలిపారు కేసీఆర్‌.

మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా, ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత అన్నారు కేసీఆర్‌. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలని కోరారు. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్న ముగించారు.

Exit mobile version