NTV Telugu Site icon

City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు

Ktr Copy

Ktr Copy

మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్‌ కోర్టు బండి సంజయ్‌ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్‌ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో మే 12న తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది.

కాగా.. మే 12న ట్విట్ట‌ర్‌లో త‌న‌పై బండి సంజ‌య్ నిరాధార‌మైన‌ ఆరోప‌ణ‌లు చేశార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు ఉంటే బ‌య‌ట పెట్టాల‌ని, లేదంటే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు బండి సంజ‌య్‌కు కేటీఆర్ త‌న న్యాయ‌వాది చేత నోటీసులు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే బండి సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు.

కేటీఆర్ ప‌రువుకు భంగం క‌లిగించేలా, అస‌త్య‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్.. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం కేటీఆర్‌కు ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 48 గంట‌ల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని న్యాయ‌వాది డిమాండ్ చేశారు.