సీ-టెట్‌ పరీక్షలు వాయిదా

దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీ-టెట్‌) పరీక్షను వాయిదా వేశారు. ఆన్‌ లైన్‌ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. అయితే ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు ప్రకటించారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్‌ -2 పరీక్షలో సర్వర్‌ సమస్య తలెత్తింది. సాయంత్రం 4 గంటలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే పరీక్షలను కూడా వాయిదా వేశారు.

వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది అభ్యర్థులకు త్వరలోనే సమాచారం ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 20 నుంచి జరిగే పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నారు. కాగా సీ-టెట్‌తో కేంద్రీయ విద్యాలయం, సైనిక్‌ స్కూల్స్‌, నవోదయ స్కూల్స్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో విద్యాబోధనకు సీటెట్‌ను ప్రామాణికంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షల కోసంప్రతి ఏడాది ఎంతోమంది ఎదురు చూస్తుంటారు.