సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ హెడ్క్వార్టర్స్ భద్రతా గదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్, మల్కాజిగిరి ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ మరియు స్టేట్ ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో నిందితుడైన మాజీ ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి ఆయుధాల మాయం
ఆగస్టు 30, 31 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో బొల్లారంలోని 20వ బెటాలియన్, మద్రాస్ రెజిమెంట్ పరిధిలోకి నిందితుడు ప్రవేశించాడు. రాత్రి 11 గంటల సమయంలో కోటే, మ్యాగజైన్ గదులను తెరిచి ఆయుధాలను దొంగిలించాడు. ఆగస్టు 31 తెల్లవారుజామున ఆయుధాలు కనిపించకపోవడంతో ఇన్చార్జి వినోద్కుమార్ నాయక్ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, మొదటి బిల్డింగ్ నుంచి 7 పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, 4 ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం క్యాలిబర్ మందుగుండు సామగ్రితో పాటు రెండో బిల్డింగ్ నుంచి మరికొన్ని ఆయుధాలు, బుల్లెట్లు మాయమైనట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
‘ఇన్సైడర్’ ప్రమేయంపై అనుమానం: లోతుగా విచారణ
అత్యంత భద్రత ఉండే ఆర్మీ హెడ్క్వార్టర్స్లో చోరీ జరగడంతో బయటి వ్యక్తుల కంటే ‘ఇన్సైడర్’ పాత్రపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అయితే మొదటి దశ విచారణలో కొందరు సిబ్బంది సహకరించకపోవడంతో సాంకేతిక ఆధారాలు, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలను క్రమంగా వినియోగించే 16 మందిని గుర్తించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో సెలవులో ఉన్న 54 మంది సిబ్బంది వివరాలను సేకరించడమే కాకుండా, సర్వీసు ముగించుకుని బయటకు వచ్చిన (పెన్షన్ ఔట్) ఏడుగురిని క్షుణ్ణంగా విచారించారు.
నల్లమలలో సోదాలు.. పలు చోట్ల ఆయుధాల దావా
విచారణలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డిపల్లికి చెందిన 37 ఏళ్ల మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్పై బలమైన ఆధారాలు లభించాయి. మల్లేష్ 2010లో సైన్యంలో చేరి 16 ఏళ్ల సేవల అనంతరం ఈ ఏడాది జూన్ 30న ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ అసంతృప్తితోనే అతను చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు బృందాలు నల్లమల ప్రాంతంలోని ఉడుమిల్లలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించి పలు మోడళ్ల తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే కౌకూర్, యాప్రాల్, అచ్చంపేట ప్రాంతాల్లో నిందితుడు దాచిన ఆయుధాలను రికవరీ చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.
డ్రగ్ మాఫియా కోణంలోనూ దర్యాప్తు
ఈ చోరీ వెనుక డ్రగ్ మాఫియా ప్రమేయం గానీ, ఇతర నేరస్థుల నెట్వర్క్ ప్రమేయం గానీ ఉందా అనే కోణంలో పోలీసు విచారణ సాగుతోంది. చోరీ చేసిన ఆయుధాలను ఎవరికి చేరవేయాలనుకున్నాడు? ఈ కుట్రలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా? అనే అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న నిందితుడు మల్లేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

