BJP MLA Etela Rajender Counter To CM KCR: టీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. తన సవాల్ని సీఎం కేసీఆర్ స్వీకరించలేక.. తన బానిసలతో ప్రెస్మీట్లు పెట్టించి తిట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు మాట్లాడుతున్న కేసీఆర్ బానిసలందరూ ఓసారి తమ గతం గురించి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని కోరారు. చెన్నూరు ఎమ్మేల్యేకు మనసు గాయపర్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. బెయిల్ ఆలస్యమైనప్పుడు, ఆయన కేసీఆర్ను బూతులు తిట్టిన వ్యక్తి అని.. తానే ఆయనకు బెయిల్ తెచ్చానని గుర్తు చేశారు. ఇంకొకరికి టికెట్ ఇస్తే.. ఓడిపోయి టీఆర్ఎస్నే తిట్టాడని ఈటెల పేర్కొన్నారు.
తానేమీ వార్డ్ మెంబర్గా, సర్పంచ్గా పోటీ చేయలేదని.. ఎమ్మేల్యే అయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని ఈటెల రాజేందర్ తెలిపారు. కెసిఆర్ దృష్టిలో బానిసలు లీడర్లని, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు కాదని చెప్పారు. 2018 ఎనికల్లోనే తనని ఓడించే ప్రయత్నం చేశారని.. తనతో పాటు మహబూబ్ నగర్లో ఒకరిని, ఖమ్మంలో ఇంకొకరిని, కరీంనగర్లో మరొకరిని ఓడించేందుకు కసరత్తులు చేశారని కుండబద్దలు కొట్టారు. నేను ఉద్యమంలో పని చేయలేదా? అని నిలదీసిన ఈటెల.. కుట్ర పూరితంగా తనని బయటకు పంపించారని ఆరోపించారు. హుజూరబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఒకరు సవాల్ చేశారన్నారు. ఇంకొక ఎమ్మెల్యే షార్ట్లు వేసుకొని చిల్ల వేషాలు వేశాడని, అతని క్యారెక్టర్పై ఆరోపణలూ వచ్చాయని ఈటెల రాజేందర్ చెప్పారు.
