DK Aruna: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు. దేశంలో తెలంగాణ తప్పా మరే రాష్ట్రం బాగుపడలేదని తండ్రీకొడుకులు గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. 8 ఏండ్లలో మీరు ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. 1200 మంది అమరుల త్యాగాల మీద గద్దెనెక్కారని ఆమె అన్నారు. మీరు చేసిన మోసాలకు ప్రజలు గద్దె దించాలని చూస్తున్నారని.. ఆ భయంతో నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.
కుర్చీ కాపాడుకునే యావ తప్పితే ఈ అయ్యా కొడుకులకు వేరే ధ్యాస లేదని డీకే అరుణ విమర్శించారు. ఇంతకు ముందు ప్రధాని మోడీ మిత్రుడు.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారని ప్రశ్నించారు. తెలంగాణకు శత్రువు మోడీ అని కామెంట్స్ చేస్తావా అంటూ మండిపడ్డారు. మీరు చేసే దోపిడీకి అడ్డు చెప్పకుంటే మిత్రుడు.. లేదంటే శత్రువా అంటూ ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్నీ మీరే పూర్తిచేశారా అంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం పూర్తి చేస్తే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక జూటాకోర్ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు కాళేశ్వరం నీళ్లను ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
Tarun Chugh: మునుగోడులో 21న బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న అమిత్ షా
కేసీఆర్ కుటుంబం బంగారుమయం అయిందని.. ప్రజలకు అప్పులు మిగిలాయని ఆరోపణలు చేశారు. ఎవరికోసం అప్పు చేశావ్ కేసీఆర్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల కోట్లు కమీషన్లు కేసీఆర్ మింగారని ఆమె ఆరోపించారు. అవన్నీ కేసీఆరే కట్టాలి.. ప్రజలపై భారం వేస్తే ఊరుకోమన్నారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి బాగోతం రాస్తే పెద్ద పుస్తకం అవుతుందన్నారు. మీరు చేసుకునే సర్వే రిపోర్టుల్లో టీఆర్ఎస్కు ఆదరణ దక్కడం లేదని జీర్ణించుకోలేక బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని తమ నేతలపై దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పాలన చేతకాకుంటే దిగిపో కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.
పాలమూరు రంగారెడ్డి విషయంలో జగన్తో ఏం ఒప్పందం చేసుకున్నావ్ కేసీఆర్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పక్క రాష్ట్రం వాళ్లు సంగమేశ్వర ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారన్నారు. వాళ్లకు కేంద్రం అడ్డు చెప్పలేదు.. కానీ పాలమూరు రంగారెడ్డికే కేంద్రం అడ్డు చెప్పిందా అంటూ ప్రశ్నించారు. అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన చూసి ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారని ఆమె అన్నారు. కేసీఆర్.. ప్రజలకు సేవ చేయడానికి రాలేదని.. ఆయన కుటుంబానికి మాత్రమే సేవ చేయడానికి వచ్చారని.. అందుకే మోడీకి కుటుంబం ఉంటే కుటుంబ రాజకీయాల గురించి తెలిసేది అని కేసీఆర్ అంటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు.