NTV Telugu Site icon

Etela Rajender Lands: ఈటలకు బిగ్‌ షాక్.. జమున హ్యాచరీస్‌ కబ్జా భూములు పంపిణీ..

Jamuna Hatcheries

Jamuna Hatcheries

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. జమున హ్యాచరీస్‌ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే కాగా.. గత కొంత కాలంగా సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు.. ఇవాళ మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు.. మొత్తంగా అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలో మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే నెంబర్ 97లో ఒక ఎకరం భూమి.. మొత్తం 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైందని తేల్చారు.. ఇక, జమున హ్యాచరీస్‌ యొక్క ప్రక్కన ఉన్న గేట్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు అంచ్చపేట సర్పంచ్‌ భర్త, రైతులు.. ఈటల కబ్జా చేసిన హ్యాచరిస్ కంపెనీలోకి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, రైతులు వెళ్లారు.

Read Also: Governor TamiliSai: అప్పటి వరకు ఆగకండి.. వయసు ఉన్నప్పుడే పెళ్లిచేసుకోండి

బాధిత రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మసాయిపేట ఎమ్మార్వో మాలతి, జమున హ్యాచరిస్ లో భూమి కబ్జా గురైన హకీంపేట గ్రామానికి చెందిన శ్యామలకు భూమి పంచనామా అందజేశారు.. మరికొందరు బాధితులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. మొత్తంగా 65 మంది రైతులకు 85 ఎకరాల భూమి పొజిషన్ ఇచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు.. భూ పట్టాల పంపిణీపై ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ కబ్జా చేసిన భూములను తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నాం.. ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని వెల్లడించారు.. ఈటల కబ్జా చేసి నిర్మించిన షెడ్లను కోర్ట్ ఆదేశాలతో ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు, పట్టాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. తిరిగి తమ భూమి తమ ఆధీనంలోకి వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు షాక్‌ తగిలినట్టు అయ్యింది.