Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!

  • యూసీ బర్క్లీలో డిప్యూటీ సీఎం భట్టి కీలక భేటీ
  • 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంపై చర్చ
  • తెలంగాణ గ్రీన్ ఎనర్జీ మోడల్‌పై ఫోకస్
  • సిలికాన్ వ్యాలీ టెక్నాలజీతో ఇంధన విప్లవానికి ప్లాన్
Bhatti

Bhatti

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీలోని గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ పరిధిలోని ‘ఇండియా ఎనర్జీ & క్లైమేట్ సెంటర్’ (IECC) ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనతో పాటు తెలంగాణను స్వచ్ఛ ఇంధన రంగాన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్ ప్రణాళికలపై లోతుగా చర్చించారు.

​భారతదేశం నిర్దేశించుకున్న 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యాన్ని అందుకునేందుకు అవసరమైన వ్యూహాలు, తగ్గుతున్న శుద్ధ సాంకేతికత ఖర్చులు తెచ్చిపెడుతున్న నూతన అవకాశాలను ఈ సమావేశంలో పరిశీలించారు. గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, ఆధునిక బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల సమన్వయం , సమాన అవకాశాలతో కూడిన శక్తి పరివర్తన మార్గాలపై పరిశోధకులు, అధికారులతో డిప్యూటీ సీఎం విస్తృతంగా ఆలోచనలు పంచుకున్నారు.

​ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన వినూత్న పునరుత్పాదక ఇంధన మోడల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారదర్శకమైన హరిత విధానం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో సౌరశక్తి సహా ఇతర పునరుత్పాదక సామర్థ్యాన్ని వేగవంతంగా విస్తరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) భాగస్వామ్యంతో సోలార్ ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టడం, పీఎం-కుసుమ్ పథకం ద్వారా అన్నదాతలకు స్వచ్ఛ ఇంధనాన్ని అందించడం వంటి ప్రజాకేంద్రిత నమూనాలు అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్నాయి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు క్లీన్-టెక్ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.

​సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా రాష్ట్ర ఇంధన రంగానుభవాలను ఉపయోగించుకుని తెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. విద్యుత్, రవాణా, పారిశ్రామిక , వాతావరణ స్థిరత్వ రంగాలలో సంయుక్త అధ్యయనాలు చేపట్టడం, విధాన నిర్ణేతలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇంధన భద్రతను, ఆర్థిక పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు యూసీ బర్క్లీ ప్రతినిధులతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.