Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్‌స్కేప్‌కు భట్టి ఆహ్వానం..!

  • క్వాంటమ్‌స్కేప్ కార్యాలయంలో భట్టి విక్రమార్క పర్యటన
  • సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీపై కీలక చర్చలు
  • R&D, తయారీకి తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం
  • EV, క్లీన్ ఎనర్జీ రంగాలపై రాష్ట్రం ఫోకస్
Bhatti

Bhatti

Bhatti Vikramarka : తెలంగాణను అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధన రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చే దిశగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక అడుగులు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన సాన్ జోస్‌లోని ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్‌స్కేప్’ (QuantumScape) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్ సహా ఉన్నతాధికారుల బృందంతో భేటీ అయి, తదుపరి తరం బ్యాటరీ సాంకేతికతలు, గ్లోబల్ సప్లై చైన్ , పెట్టుబడుల అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సాంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే అత్యంత సురక్షితమైన, వేగంగా ఛార్జ్ అయ్యే, ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యం గల ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీల అభివృద్ధిని డాక్టర్ శివరామ్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని డిప్యూటీ సీఎంకు వివరించారు.

గ్లోబల్ సప్లై చైన్ – భవిష్యత్ మార్పులు కీలక ఖనిజాల లభ్యత, అధునాతన విడిభాగాల తయారీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ , ఎలక్ట్రిక్ వాహనాలలో వీటి వినియోగంపై ఇరువర్గాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. భవిష్యత్తులో ఈ నూతన బ్యాటరీ సాంకేతికతలు గ్లోబల్ సరఫరా గొలుసును (Supply Chain) ఎలా పునర్నిర్మిస్తాయో, కొత్త భాగస్వామ్యాలకు ఎలా బాటలు వేస్తాయో విశ్లేషించారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం

రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రతిభ, స్వచ్ఛ ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఆర్‌ అండ్ డి (R&D), విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు భాగస్వామ్యాలతో పాటు, భవిష్యత్తులో ఈ సాంకేతికతను భారత్‌లోనే స్థానికీకరించే (Localisation) దిశగా తెలంగాణలో విస్తరణ అవకాశాలను పరిశీలించాలని క్వాంటమ్‌స్కేప్‌ ప్రతినిధులను కోరారు. అంతర్జాతీయ ఆవిష్కరణల దిగ్గజాలకు, తెలంగాణలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక, తయారీ రంగాలకు మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.