Bhatti Vikramarka : AIను పరిపాలనలో ఉపయోగించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలి

  • ఎంసీఆర్హెచ్ఆర్డీ గవర్నింగ్ బాడీ సమావేశంలో కీలక నిర్ణయాలు
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై భట్టి విక్రమార్క దృష్టి
  • అధికారుల శిక్షణలో సమగ్ర ప్రణాళికలు
  • స్వయం సహాయక సంఘాల శిక్షణ, ఆర్థిక పురోగతి లక్ష్యం
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : ఎంసీఆర్హెచ్ఆర్డీ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

సమావేశానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్ బీ ఈఎన్‌సి జయ భారతి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

×
×
Ad

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంసీఆర్హెచ్ఆర్డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని ఆకాంక్షించారు. దీనికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సంస్థ స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా పురోగమించాలని సూచించారు.

పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. దేశంలోనే మొట్టమొదట పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అందరికీ సమగ్ర శిక్షణ అందించాలని సూచించారు.

అంతేకాకుండా, స్వయం సహాయక సంఘాల (Self-Help Groups) నాయకులకు జిల్లా, మండల స్థాయిల్లో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని భట్టి విక్రమార్క అన్నారు. గత పదేళ్లుగా ఎంసీఆర్హెచ్ఆర్డీపై తగినంత దృష్టి సారించలేదని పేర్కొన్న ఆయన, ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్-కమిటీ సమావేశం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.