భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదం గురించి మమ్మల్ని ఆశ్రయించారని, వారి ఇష్టపూర్తిగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంబం రావడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ఆయన వెల్లడించారు.
కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు, ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది అంటూ ఆయన విమర్శించారు. నేను ఎలాంటి భూకబ్జాలు, సెటిల్ మెంట్లకు పాల్పడలేదు, రామకృష్ణ ఆత్మహత్య విషయంలో పార్టీ అధిష్టానం వివరణ కోరలేదు, వివరణ అడిగితే నేను తప్పకుండా చెబుతాను అంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీరయ్య నన్ను కాల్చాలని అన్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. గతం లో జరిగిన మరో ఆత్మహత్య కేసులో.. నాపై ఆధారాలు ఎందుకు రుజువు చేయలేకపోయారు. నేను సాధారణ పార్టీ కార్యకర్తను. వనమా రాఘవ రాజకీయ ఎదుగుదల చూడలేకనే ఈ ఆరోపణలు, కొత్తగూడెం ప్రజలకు త్వరలోనే నిజాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.