అసని తుఫాన్ ముంచుకొస్తున్న. ఈ ఏడాది మొదటి తుఫాన్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రజలపై విరుచకుపడేందుకు సిద్ధమైంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
వేసవికాలం ప్రారంభంలోనే భానుడి భగభగలకు మండిపోతున్న భాగ్యనగర వాసులు నిన్న కురిసిన చిరుజల్లులతో సేదతీరారు. తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడడంతో ప్రజలు కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడి అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. భగభగమండే రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
