కాశీలోని జ్ఞాన్వాపి మసీదు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్లో మూసివేసిన 22 గదులు తెరవాలంటూ కోర్టు ఆశ్రయించారు. అయితే తాజాగా జ్ఞాన్వాపి మసీదులో బయట పడ్డ శివలింగంపై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంఘ్ ఈ దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని చూస్తోందని అసద్ విమర్శించారు. జ్ఞాన్వాపి మసీదును వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతం అవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారన్న అసద్.. జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంలో కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమంటూ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంపై ఒవైసీ స్పందిస్తూ.. ఎన్కౌంటర్లకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు.