Site icon NTV Telugu

Smartphone Charging Tips: స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ ఎలా పెట్టాలి..? 100 శాతం దాటితే పేలిపోయే ప్రమాదం ఉందా..?

Smartphone Charging Tips

Smartphone Charging Tips

Smartphone Charging Tips: స్మార్ట్‌ఫోన్‌లు మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. అయితే ఫోన్‌ను ఎలా వాడుతున్నామన్నదే దాని జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఛార్జింగ్ విషయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు, భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. ముఖ్యంగా.. చాలా మంది రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉదయం వరకు అలాగే ఉంచుతుంటారు. ఇది సౌకర్యంగా అనిపించినా.. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఆరోగ్యానికి మాత్రం తీవ్ర హానికరం. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు సైతం రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచొద్దని సూచిస్తున్నాయి.

Read Also: Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు

లిథియం-అయాన్ బ్యాటరీలపై ఒత్తిడి
నేటి స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలు 100 శాతం ఛార్జ్ అయినప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల బ్యాటరీలోని కెమికల్ స్ట్రెస్ పెరిగి, క్రమంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు..

100 శాతం ఛార్జ్ తర్వాత ప్రమాదం..!
చాలా ఫోన్లు 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచితే వేడిని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ అధిక వేడి బ్యాటరీని దెబ్బతీయడమే కాకుండా, అరుదైన సందర్భాల్లో ఫోన్ పేలిపోవడానికి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే 100 శాతం ఛార్జ్ అయిన వెంటనే ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసివేయడం మంచిది అని సలహా ఇస్తున్నారు..

అసలు.. ఎంత శాతం వరకు ఛార్జ్ చేయాలి?
నిపుణుల సూచనల ప్రకారం స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేయడం.. లేదా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడం రెండూ మంచివి కావు. సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువకాలం మంచి పనితీరు చూపుతుంది.

బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖరీదు
ఐఫోన్‌తో పాటు అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాటరీ మార్పిడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకటి లేదా రెండు సంవత్సరాల వాడకానికే బ్యాటరీ ఆరోగ్యం 2 నుంచి 5 శాతం వరకు తగ్గిపోవడం చాలామంది వినియోగదారులు గమనిస్తున్నారు. అందుకే మొదటి నుంచే సరైన ఛార్జింగ్ అలవాట్లు పాటిస్తే అనవసర ఖర్చులు తప్పుతాయి. ఇక, రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఫోన్ వేడెక్కే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల రాత్రి ఛార్జింగ్ అలవాటు మానుకుని, అవసరమైనంతవరకే ఛార్జ్ చేయడం మేలు. మొత్తం మీద, స్మార్ట్‌ఫోన్‌ను జాగ్రత్తగా ఛార్జ్ చేయడం ద్వారా బ్యాటరీ ఆయుష్షు పెరగడమే కాకుండా, ప్రమాదాలను కూడా నివారించవచ్చు. చిన్న మార్పులు చేస్తే పెద్ద నష్టాలను తప్పించుకోవచ్చు అన్నది నిపుణుల సూచన.

Exit mobile version