NTV Telugu Site icon

Fact Check: “3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్”.. ఈ మెసేజ్ నిజమేనా ?

Fact Check

Fact Check

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్‌లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్‌ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్‌తో పాటు లింక్ కూడా షేర్ చేశారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్‌ను పొందవచ్చు అని తెలిపారు.

నవంబర్ 27న వైరల్ పోస్ట్‌..
నవంబర్ 27, 2024న ఫేస్‌బుక్‌ (Facebook) వినియోగదారు రుషికేష్ కాలే ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. క్యాప్షన్‌లో “ప్రధాన మంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతదేశంలోని వినియోగదారులందరూ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పొందడం ప్రారంభించారు. నేను కూడా 84 రోజుల ఉచిత రీఛార్జ్ ను పొందాను. మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ పొందవచ్చు. ఈ పథకం 30 డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఉంటుంది.” అని పేర్కొన్నాడు.

విచారణ…
లింక్ ను పరీక్షించేందుకు మేము వైరల్ పోస్ట్‌లో ఉన్న లింక్ యొక్క URLని చెక్ చేశాం. పోస్ట్‌లో ఇచ్చిన లింక్ URL techtadaka.com అని కనుగొన్నాం. ఇది ఏ అధికారిక వెబ్‌సైట్‌కి సంబంధించి లింక్ కాదని స్పష్టమైంది. అనంతరం మేము ఇలాంటి పథకం ఏమైనా కేంద్రం ప్రవేశ పెట్టిందా? అని చెక్ చేశాం. అలాంటి పథకం లేదని తెలుసుకున్నాం. అంతే కాకుండా వైరల్ అవుతున్న మెసేజ్‌లో జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్ఎల్, తదితర టెలికాం కంపెనీల పేర్లు ప్రస్తావించారు. ఆయా టెలికాం కంపెనీల అధికారిక సైట్లు చెక్ చేశాం. అందులో కూడా ఇలాంటి స్కిం వివరాలు కనిపించలేదు.

నిపుణుల సమాచారం..
అయితే.. ఈ మెజేస్‌పై నిపుణులను సంప్రదించాం. వారు మాట్లాడుతూ.. “ఇలాంటి లింక్‌లను వినియోగదారులను మోసం చేయడానికి వాడుతుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేసే ముందు.. మీరు URLని జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఈ మెసేజ్ పూర్తిగా నకిలీది. వినియోగదారులు జాగ్రత్తలు వహించాలి.” అని టెలికాం నిపుణులు స్పష్టం చేశారు.