Site icon NTV Telugu

Elon Musk: మస్క్ సంచలన నిర్ణయం.. ఈ సారి చంద్రుడిపై ప్రపంచ కుబేరుడి కన్ను..

Mask

Mask

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్ చేశారు. ఇప్పుడు మస్క్ కన్ను భూమిపై నుంచి చంద్రుడి పైకి సిఫ్ట్ అయ్యింది. మస్క్ మరోసారి తన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ఇప్పుడు మార్స్ కంటే చంద్రుడిపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని ప్రకటించారు. చంద్రుడిపై మనుషులు నివసించగలిగేలా ఓ నగరాన్ని నిర్మించడమే తమ కొత్త లక్ష్యమని వెల్లడించారు. ఇది మార్స్‌ కంటే వేగంగా చంద్రుడిపై నగర నిర్మాణం సాధ్యమవుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఈమేరకు మస్క్ ఓ పోస్ట్ చేశారు. చంద్రుడిపై ఈ ప్రాజెక్ట్‌ను పదేళ్లలోపు పూర్తి చేయొచ్చని అందులో పేర్కొన్నారు. కానీ మార్స్‌పై పూర్తిస్థాయి నగరం ఏర్పడాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని తెలిపారు. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడాలంటే చంద్రుడే ఇప్పుడు సరైన మార్గమని వివరించారు.

READ MORE: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే

మస్క్ మాటల్లో చెప్పాలంటే, స్పేస్‌ఎక్స్ ఇప్పటికే చంద్రుడిపై నగరం నిర్మించే దిశగా అడుగులు వేసింది. ఎందుకంటే.. చంద్రుడికి వెళ్లడం సులువుగా మారింది. ప్రతి 10 రోజులకు ఒకసారి చంద్రుడి పైకి రాకెట్ పంపే అవకాశం ఉందట. ప్రయాణం కూడా కేవలం రెండు రోజుల్లో పూర్తవుతుందని మస్క్ వివరించారు. కానీ మార్స్‌కు వెళ్లాలంటే పరిస్థితి పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. భూమి, మార్స్ గ్రహాలు కక్షలో అనుకూలంగా ఉండే అవకాశం దాదాపు 26 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుందట. అంతేకాదు, మార్స్ ప్రయాణానికి ఆరు నెలల సమయం పడుతుందట. చంద్రుడిపైకి వెళ్లడం ఈజీ అని మస్క్ తెలిపారు. అందుకే చంద్రుడిపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. అయితే.. స్పేస్ ఎక్స్ మార్స్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని తెలిపారు. మార్స్ ప్రాజెక్ట్ కూడా స్పేస్‌ఎక్స్ దీర్ఘకాల లక్ష్యంలో భాగమేనని వెల్లడించారు. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో మార్స్‌పై మానవ నివాసాన్ని ప్రారంభించే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పారు. “మార్స్‌పై నగరం నిర్మించడమే మా తుదిలక్ష్యం. ఆ దిశలో కూడా మా ప్రయత్నాలు ఆగవు” అని మస్క్ తెలిపారు. ఇంతకుముందు మస్క్ 2026 చివరికి మార్స్‌కు మానవుల్లేని మిషన్ పంపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ తాజా ప్రకటన చూస్తే, మార్స్ కంటే ముందు చంద్రుడిపై పెద్ద అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. స్పేస్‌ఎక్స్ పెట్టుబడిదారులకు ముందుగా చంద్రుడిపై మిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 2027 మార్చిలో చంద్రుడిపై మానవుల్లేని ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Exit mobile version