Airtel: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ (Airtel) వినియోగదారుల కోసం మరో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కంటే కాల్స్ ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లను, అలాగే రెండో సిమ్ గా ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రూ.1,849 వార్షిక ప్లాన్ను రూపొందించింది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పొడవునా సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
రూ.1,849 రీఛార్జ్:
ఈ ప్లాన్లో వినియోగదారులకు దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే ఎయిర్టెల్ నంబర్లకే కాకుండా ఇతర టెలికాం నెట్వర్క్లకు కూడా ఎలాంటి పరిమితులు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్లో మొబైల్ డేటా సదుపాయం ఉండదు. అందువల్ల ప్రధానంగా కాల్స్ కోసం ఫోన్ ఉపయోగించే వారికి, ఇంట్లో లేదా కార్యాలయంలో వై-ఫై(WI FI) సదుపాయం ఉన్న వారికి, తక్కువ ఖర్చుతో మొబైల్ కనెక్షన్ కొనసాగించాలని భావించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
అలాగే సీనియర్ సిటిజన్లు లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఒక సెకండరీ సిమ్ను యాక్టివ్గా ఉంచాలనుకునే వారికి కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు నంబర్ యాక్టివ్గా ఉండటంతో నెలనెలా రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ఎయిర్టెల్ మరో వార్షిక ప్లాన్ను కూడా అందిస్తోంది. రూ.2,249 ప్లాన్లో ఏడాది పాటు అపరిమిత కాల్స్తో పాటు మొత్తం 30 జీబీ డేటా లభిస్తుంది. మెసేజింగ్, యూపీఐ లావాదేవీలు, ఈమెయిల్స్ వంటి సాధారణ అవసరాలకు ఈ డేటా సరిపోతుంది.

