Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!

  • రూ.299, రూ.579, రూ.619, రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు..
  • రూ.299 ప్లాన్‌కు బదులుగా రూ.349 రీచార్జ్ ప్లాన్‌
  • ఎంట్రీ లెవల్‌లో ఉన్న రూ.199, రూ.219 ప్లాన్లు కొనసాగింపు..
Airtel (1)

Airtel (1)

Airtel Recharge Plans: టెలికాం దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన ఎయిర్‌టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న 4 మిడ్-రేంజ్ రీచార్జ్ ప్లాన్‌లను క్యాటలాగ్ నుంచి తొలగించింది. దీంతో ఈ ప్లాన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇకపై ఇతర రీచార్జ్ ఆప్షన్లకు మారాల్సి ఉంటుంది.

రూ.299 ప్లాన్ తొలగింపు:

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లలో ఎక్కువగా ఉపయోగించే మిడ్-రేంజ్ ప్లాన్‌లలో రూ.299 రీచార్జ్ కూడా ఒకటి. ఈ ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ లభించేది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను కంపెనీ తొలగించింది. రూ.299 ప్లాన్‌కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం రూ.349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఇందులో రోజుకు 1GBకి బదులుగా 1.5GB డేటా లభిస్తుంది. అంటే గతంలో రూ.299తో పొందిన రోజువారీ డేటా అవసరాలను కొనసాగించాలనుకునే వినియోగదారులు ఇకపై రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. రూ.299 ప్లాన్ స్థానంలో రూ.349 ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల వినియోగదారులపై దాదాపు 16% అదనపు ఖర్చు పడుతుంది. మరోవైపు ఎయిర్‌టెల్‌ ఎంట్రీ లెవల్ విభాగంలోని రూ.199, రూ.219 ప్లాన్‌లను మాత్రం కొనసాగిస్తోంది. అంటే ఈ రెండు రీచార్జ్ ఆప్షన్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయలేదు.

ఆ ప్లాన్లు కూడా తొలగింపు:

రూ.299 ప్లాన్‌తో పాటు రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ తన క్యాటలాగ్ నుంచి తొలగించింది. దీంతో కంపెనీ మిడ్-టియర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల లైనప్‌లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఈ ప్లాన్‌లను ప్రస్తుతం రీచార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు అందుబాటులో ఉన్న ఇతర టారిఫ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ARPU పెంచే వ్యూహం.?

ఈ ప్లాన్‌లను ఎందుకు తొలగించిందనే విషయంపై ఎయిర్‌టెల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే టెలికాం రంగంలో కంపెనీలు తమ Average Revenue Per User (ARPU)ను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఈ మార్పులు వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. నెట్‌వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉండటంతో పాటు పెట్టుబడులపై తగిన రాబడిని సాధించేందుకు టెలికాం కంపెనీలు అధిక విలువ కలిగిన ప్లాన్‌ల వైపు వినియోగదారులను మళ్లిస్తున్నాయి.