NTV Telugu Site icon

5G Technology : దేశంలో 5జీ ప్రారంభానికి ముహూర్తం ఎప్పుడు..? 5జీతో ఏం మారబోతోంది..?

5g

5g

ఇంటర్నెట్‌ వేగం కోసం, సినిమాల డౌన్లోడ్‌ కోసమేనా 5జీ అంటే… కాదనే చెప్పాలి. 5జీ అంటే- సామర్థ్యం, మన్నిక, భద్రత, నమ్మకం, తెలివైన యంత్రాలు, సరికొత్త ప్రమాణాలు. మనిషి అనుభవాల్నీ అనుభూతుల్నీ ఒక కొత్త స్థాయికి చేర్చగల సాధనం. ఇంటి నుంచి ఆఫీసు వరకూ, వైద్యం నుంచి వ్యవసాయం వరకూ దాదాపుగా అన్ని రంగాలనూ ప్రభావితం చేయగల శక్తి. ఇన్నాళ్లూ అక్కడక్కడా ప్రయోగాత్మకంగా మాత్రమే చూసిన వింతలూ విశేషాలూ, ఊహలుగా ఉన్నవీ ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి.

దేశంలో 5జీ సేవలు ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయని భావించినా…వాయిదా పడ్డాయ్. స్పెక్ట్రమ్‌ వేలం అంచనాలకు మించి మరికొన్ని రోజులు అదనంగా కొనసాగడం, టెలికాం కంపెనీలు 5జీ ఎక్విప్‌మెంట్‌ను అమర్చుకోవడానికి అదనపు సమయం తీసుకున్నాయ్. దీంతో ఈనెలలో ప్రారంభం కావాల్సిన 5జీ సేవలు…సెప్టెంబర్‌ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయ్. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022 ప్రారంభమయ్యే రోజే మొదలు కానున్నాయ్. దేశవ్యాప్తంగా 5జీ సేవలు తొలుత 13 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లోనూ ఈ జాబితాలో ఉంది. అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయ్. క్రమంగా దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నాయి టెలికం కంపెనీలు. 2024 మార్చి నాటికి అన్ని నగరాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయ్.

మహమ్మారి కారణంగా టెలికాం కంపెనీలు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడంలో ఆలస్యమైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం 5 జీ స్పెక్ట్రం వేలాన్ని 2021లోనే భావించినా…కోవిడ్ దెబ్బ కొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, అదే సమయంలో స్పెక్ట్రం వేలంలో భాగంగా… ప్రభుత్వం ఒక్కో యూనిట్ ధర 492 కోట్ల రూపాయలుగా పేర్కొంది. దీంతో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో సహా అప్పటికే భారీ ఎత్తున బకాయిలున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు భారం అనిపించింది. 5జీ నెట్ వర్క్‌లో కీలకమైంది…ఫైబర్ నెట్‌వర్క్ లైన్లు. 2021లో CRISIL రిసెర్చ్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం… దేశంలో అప్పటికి 25 నుంచి 30 శాతం మాత్రమే ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. మరో 70శాతం మేర ఈ నెట్‌వర్క్ అందుబాటులోకి రావాల్సి ఉండటంతో…2022కి వాయిదా పడింది. ప్రతి టెలికాం సంస్థ 100 శాతం ఫైబర్ నెట్క్‌వర్క్‌ను కలిగి ఉండాలంటే వచ్చే 2 ఏళ్లలో కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అన్ని రకాల ఖర్చులు కలుపుకొని కనీసం కిలోమీటరుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఏడు రోజుల పాటు సాగిన 5జీ వేలంలో మొత్తం 1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు బిడ్లు వచ్చాయ్. వేలంలో మొత్తం 10 బ్యాండ్లకు చెందిన 72,098 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టగా.. అందులో 71 శాతానికి సమానమైన 51,236 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కంపెనీలు కొనుగోలు చేశాయ్. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. పలు బ్యాండ్లకు చెందిన 24,740 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 88,078 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అమ్ముడైన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం అంబానీయే కొనుగోలు చేశారు. వేలంలో 700, 800, 1,800, 3,300 మెగాహెట్జ్‌తోపాటు 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పెక్ట్రమ్‌ను రిలయన్స్‌ జియో దక్కించుకుంది. ముఖ్యంగా దేశంలోని 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు కంపెనీకి 5జీ సేవల్లోనూ ఆధిపత్యానికి దోహదపడనుంది. 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌తో 6-10 కిలోమీటర్ల వరకు సిగ్నల్‌ అందించవచ్చు. మిగతా బ్యాండ్‌విడ్త్‌లతో పోలిస్తే, ఒక్కో టవర్‌తో ఎక్కువ ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేందుకు వీలుపడుతుంది.

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌.. 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు చెందిన 400 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 212 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన మొత్తం స్పెక్ట్రమ్‌లో ఒక శాతం కన్నా తక్కువ అదానీ దక్కించుకుంది. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ కోసం ఉపయోగించే 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పెక్ట్రమ్‌ను…గుజరాత్‌, ముంబై, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్కిళ్లలో కొనుగోలు చేశారు. సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఐదు బ్యాండ్లకు చెందిన 19,867.8 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 43,084 కోట్లకు దక్కించుకుంది. 900, 1800, 2100, 3300 మెగాహెట్జ్‌తో పాటు 26 గిగాహెట్జ్‌ బ్యాండ్లలో స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది. జియోకు ప్రధాన పోటీదారైన ఈ కంపెనీ 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రం కొనుగోలు చేయలేదు. వొడాఫోన్‌ ఐడియా పలు బ్యాండ్లకు చెందిన 6,228 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 18,784 కోట్లకు కొనుగోలు చేసింది.

తొలిసారి ఆఫర్‌ చేసిన 600 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు కంపెనీలు ఆసక్తి చూపలేదు. మూడింట రెండొంతుల బిడ్లు 3,300 మెగాహెట్జ్‌, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ కోసమే దాఖలయ్యాయి. పాతిక శాతానికి పైగా బిడ్లు 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కోసం వచ్చాయ్. 2016, 2021లో నిర్వహించిన వేలంలో ఈ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ను కంపెనీలకు 20 ఏళ్ల కాలానికి కేటాయించారు. కొనుగోలు చేసిన కంపెనీలు అప్‌ఫ్రంట్‌ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. 20 వార్షిక వాయిదాల్లో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

5జీ సేవలు అందుబాటులోకి వస్తే…2026 నాటికి దేశంలో 5జీ సబ్ స్క్రిప్షన్లు 35 కోట్లకు చేరే అవకాశం ఉంది. దేశంలోని మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో 27 శాతంగా ఉండనుంది. ఉపాధి అవకాశాల విషయానికి వస్తే 2025 నాటికి 5జీ ఆధారిత ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర రంగాల్లో… సుమారు 2కోట్ల 20 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది. 2021 డిసెంబర్‌ నాటికి దేశంలో 64.6కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో వారి సంఖ్య 90 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా.దీనికి ప్రధాన కారణం…5జీ సేవలు అందుబాటులోకి రావడమే.

యంత్రాలు వాటికవే ఆలోచించి నిర్ణయం తీసుకునే కృత్రిమ మేధ, వేర్వేరు యంత్రాలూ లేదా పనిముట్లూ ఒకదానితో ఒకటి సంభాషించుకుని సమన్వయంతో పనిచేసే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ లాంటివీ… అన్నీ మన నిత్యజీవితంలోకి వచ్చేందుకు 5జీనే మార్గం. ఇంతటితో ఆగలేదు, దీనితో ఇంకా ఏమేం చేయొచ్చన్న దిశగా ఇతర దేశాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగానే 5జీకి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉందంటున్నాయి ఇప్పటికే దీన్ని వాడుతున్న దేశాలు.

జీ అంటే జనరేషన్‌ అనే అర్థం. ఈ వైర్లెస్‌ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ అభివృద్ధినీ తరాల్లో కొలుస్తున్నారు. కాకపోతే మనుషుల్లా కాకుండా… నలభయ్యేళ్లలోనే ఇది ఐదో తరంలోకి వచ్చేసింది.

ప్రస్తుతం మన చేతిలోని స్మార్ట్‌ ఫోను ఎలా మొదలై… ఈ దశకి వచ్చిందో ప్రతి దశ ఆసక్తికరమే. నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ కంపెనీ 1979లో మొదటితరం మొబైల్‌ ఫోన్‌ని…టోక్యో వాసులకు పరిచయం చేసింది. 1984కల్లా జపాన్‌ దేశమంతటా 1జీ సర్వీసును అందించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మోటరోలా లాంటి కంపెనీలు…ఆ సాంకేతికతను అన్ని దేశాలకూ వ్యాపింపజేశాయ్. అప్పట్లో అది విప్లవాత్మకమైన మార్పు. అయితే ఫస్ట్‌ జనరేషన్‌ ఫోనులో మాటలు సరిగా వినిపించేవి కాదు. విపరీతమైన శబ్దాలు వచ్చేవి. రోమింగ్‌, సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్‌ లాంటివేవీ లేవు. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2.4 కేబీపీఎస్‌ మాత్రమే.

ఫిన్లాండ్‌ 1991లో గ్లోబల్‌సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ 2జీ నెట్‌వర్క్‌ ప్రారంభించింది. ఎస్‌ఎంఎస్‌లూ పంపుకోవడం అప్పటి నుంచే మొదలైంది. బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌ పనితీరు ఇక్కడి నుంచే మొదలైంది. 2001లో డొకొమొ కంపెనీ…3జీ సదుపాయాన్ని జపానులో ప్రారంభించింది. అంతర్జాతీయ రోమింగ్‌, ఈ-మెయిల్స్‌ లాంటి వాటికి వెసులుబాటు వచ్చింది. లైవ్‌ వీడియో చాట్‌కి తెరలేచింది. ఇంటర్నెట్‌ని బ్రౌజింగ్‌, పాటలు వినడం 3జీలో అందుబాటులోకి వచ్చాయ్. బ్లాక్‌బెర్రీ, ఆపిల్‌ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ తయారీ మొదలుపెట్టాయ్. ఐఫోన్‌ రాకతో అవి పాపులర్‌ అయి, డేటాకి డిమాండ్‌ పెరగడంతో 12.5 ఎంబీపీఎస్‌ వేగంతో నాలుగో తరాన్ని అంటే 4జీని తెచ్చారు. 2011లో కెనడా మొదటిసారి ఎల్‌టీఈ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ని ప్రారంభించింది. సోషల్‌ మీడియా, హెచ్‌డీ స్ట్రీమింగ్‌, గేమింగ్‌, ఉబర్‌ లాంటి ఇంటరాక్టివ్‌ ఆప్స్‌ వాడకం మొదలైంది.

ప్రస్తుతం 4జీ టెక్నాలజీ నడుస్తుండగా…వచ్చే నెల 5జీ సేవలు దేశంలో ప్రారంభం కానున్నాయ్. ప్రపంచంలో సాంకేతిక విప్లవంలో అనేక మార్పులు వస్తున్నాయ్. పట్టణం నుంచి పల్లె దాకా…స్మార్ట్‌ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వారు వీరు అని లేకుండా…అందరూ ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దేశంలో దాదాపు 70 కోట్ల మంది 4జీ సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 4జీకి మించిన సేవలు అవసరమయ్యాయ్. దీంతో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయ్. మనం తరచూ ఎదుర్కొనే నెట్‌వర్క్‌ సమస్యలకు చెక్‌ పెడుతూన…మరెన్నో కొత్త సౌకర్యాలను మనకు చేరువ చేయబోతోంది 5జీ.

ఆన్‌లైన్‌లో మీటింగ్‌ జరిగేటప్పుడు ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోయి అవతలి వాళ్ల మాటలు ముక్కలు ముక్కలుగా వినపడటం, ల్యాప్‌టాప్‌ తెర అంతా ఎవరు ఎవరో కనపడకుండా అలుక్కుపోవడం, ట్యాక్సీ బుక్‌ చేస్తే కనెక్టింగ్‌ దగ్గర ఆగిపోయి పావుగంట విసిగించడం, ఒక్క సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోడానికి అరగంట పట్టడం, పిల్లల పరీక్షల ఫలితాలు వస్తే సర్వర్‌ డౌన్‌ అయిపోయి ఇంట్లో కంప్యూటర్‌ ఉండీ రిజల్ట్‌ చూసుకోవడానికి టెన్షన్‌ పడాల్సిరావడం, ఏ కిరాణా దుకాణానికో వెళ్లి గూగుల్‌పేనో ఫోన్‌పేనో చేసినప్పుడు మన ఖాతాలో డబ్బులు మైనస్‌ అయ్యి అవతలి ఖాతాలో పడకుండా ట్రాన్సాక్షన్‌ సగంలో ఆగిపోవడం… ఇలా మనం తరచూ ఎదుర్కొనే నెట్‌వర్క్‌ సమస్యలు ఎన్నో. ఇలాంటి వాటన్నిటికీ తెరదించుతూ మరెన్నో కొత్త సౌకర్యాలను మనకు చేరువ చేయబోతోంది 5జీ… అంటే- ఐదో తరం టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ.

1984కల్లా జపాన్‌ దేశమంతటా 1జీ సర్వీసును అందించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మోటరోలా లాంటి కంపెనీలు ఆ సాంకేతికతను అన్ని దేశాలకూ చేరవేశాయి. ఆరోజుల్లో అది విప్లవాత్మకమైన మార్పే అయినప్పటికీ ఫోనులో మాట సరిగా వినిపించేది కాదు. విపరీతమైన శబ్దాలు వచ్చేవి. రోమింగ్‌, సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్‌ లాంటివేవీ తెలియవు. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2.4 కేబీపీఎస్‌ మాత్రమే.

అయినా 1జీకి లభించిన ఆదరణ చూసి 1991లో గ్లోబల్‌సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌(జీఎస్‌ఎం) నెట్‌వర్క్‌ మీద 2జీని ప్రారంభించింది ఫిన్లాండ్‌. దీని వేగం 50 కేబీపీఎస్‌. కంటెంట్‌ని ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కి పంపుకోవడానికి వీలయింది దీంతోనే. ఎస్‌ఎంఎస్‌లూ ఎంఎంఎస్‌లూ కొత్త కమ్యూనికేషన్‌ మార్గాలయ్యాయి. బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌ పనితీరు ఇక్కడినుంచే మొదలైంది. సెల్‌ఫోన్ల వాడకం బాగా పెరిగింది. దాంతో 2001లో డొకొమొ కంపెనీ 3జీ సదుపాయాన్ని జపానులో ప్రారంభించింది. 2జీ కన్నా నాలుగు రెట్లు వేగంగా (2 ఎంబీపీఎస్‌) డేటాని బదిలీ చేయగల సామర్థ్యం దీనిది. ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, ఈమెయిల్స్‌ లాంటివాటికి వెసులుబాటు వచ్చింది. లైవ్‌ వీడియో చాట్‌కి తెరలేచింది. ఇంటర్నెట్‌ని బ్రౌజ్‌ చేసే అవకాశమూ, పాటలు వినగలగడమూ 3జీలో చెప్పుకోదగ్గ విశేషాలు. బ్లాక్‌బెర్రీ, ఆపిల్‌ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ తయారీ మొదలుపెట్టిందీ అప్పుడే. ఐఫోన్‌ రాకతో అవి పాపులర్‌ అయి, డేటాకి డిమాండ్‌ పెరగడంతో 12.5 ఎంబీపీఎస్‌ వేగంతో నాలుగో తరాన్ని- అంటే 4జీని తెచ్చారు. 2011లో కెనడా మొదటిసారి ఎల్‌టీఈ(లాంగ్‌ టర్మ్‌ ఇవొల్యూషన్‌) వైర్లెస్‌ నెట్‌వర్క్‌ని ప్రారంభించింది. క్రమంగా దాని స్పీడ్‌ కూడా సగటున 30 ఎంబీపీఎస్‌కి చేరింది. సోషల్‌ మీడియా, హెచ్‌డీ స్ట్రీమింగ్‌, గేమింగ్‌, ఉబర్‌ లాంటి ఇంటరాక్టివ్‌ ఆప్స్‌ వాడకం మొదలైంది. అయితే సాంకేతికత నానాటికీ పెరుగుతూనే ఉంది. ఫోను వాడకానికి ఒక హద్దంటూ లేకుండా పోయింది. దాంతో ఇంకా వేగంగా ఉండే నెట్‌వర్క్‌ అవసరం వచ్చింది. దాని ఫలితమే 5జీ.

ఈ ఐదోతరం కూడా నిజానికి 2019లోనే మొదలైంది. దక్షిణ కొరియాలోని టెలికాం ప్రొవైడర్స్‌ 4జీ కన్నా ఇరవై రెట్లు వేగంగా పనిచేసేలా దీన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది ఎంత వేగంగా పనిచేస్తుందంటే డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌కి ఒక్క క్షణం కూడా వేచి చూసే పనిలేదు. ఇలా బటన్‌ నొక్కగానే అలా డేటా బదిలీ జరిగిపోతుంది. ఇప్పుడా పని జరగడానికి 50 నుంచి 100 మిల్లిసెకన్ల సమయం పడుతోందట. 5జీతో అది ఒక్క మిల్లిసెకన్‌కి తగ్గిపోతుందని అంచనా. క్రమంగా ఇది 4జీ కన్నా వంద రెట్లు స్పీడుగా పనిచేయగలదంటున్నారు. గత జులై ఆఖరు నాటికి 70కి పైగా దేశాల్లో 5జీ అందుబాటులో ఉంది. అన్ని దేశాలూ కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నాయి కానీ పూర్తిగా దేశమంతటా ఇంకా ఎవరూ ఇవ్వడం లేదు. చైనా అత్యధికంగా 356 నగరాల్లో 5జీ సేవల్ని అందిస్తుండగా 296 నగరాలతో ఆ తర్వాత స్థానంలో ఉంది అమెరికా. ఫిలిప్పీన్స్‌, దక్షిణ కొరియా, కెనడా, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, సౌదీ అరేబియాలు 50నుంచి 100 లోపు నగరాల్లో 5జీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మన దేశంలోనూ మొదట కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఎక్కువ సెల్‌ టవర్లూ, 5జీ సామర్థ్యం ఉన్న ఫోన్లూ ఉండేది నగరాల్లోనే కాబట్టి ఈ సౌకర్యాన్ని మొట్టమొదట అక్కడే కల్పిస్తారు. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. అసలీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తుందంటే- ఒక్కో ప్రాంతాన్ని చిన్న చిన్న భాగాలుగా(సెల్స్‌) విడదీస్తారు. ఒక్కో సెల్‌లో ఉన్న ఫోన్లన్నీ ఒక టవర్‌కి అనుసంధానమై పనిచేస్తాయి కాబట్టే మొబైల్‌ ఫోన్‌ని సెల్‌ ఫోన్‌ అంటారు. ఫోనులో మాట్లాడేటప్పుడు ధ్వని తరంగాలు ఈ సెల్‌ టవర్‌ ద్వారానే రేడియో తరంగాలుగా మారి ప్రయాణిస్తాయి. ఏడులక్షల సెల్‌ టవర్లతో ప్రపంచంలో మనమే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ చాలా ప్రాంతాలకు ఇంకా నెట్‌వర్క్‌ సమస్య ఉంది. మామూలు ఫోను మాట్లాడాలంటేనే చెట్టో వాటర్‌ ట్యాంకో ఎక్కే పరిస్థితి. అలాంటిది ఇక 5జీ నెట్‌వర్క్‌ ఇవ్వడం అంటే అంత తేలిక కాదు. ప్రస్తుతానికి 4జీ టవర్లనే వాడుతున్నప్పటికీ 5జీ కోసం ప్రత్యేక టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఫైబరైజేషన్‌ కూడా పెంచుతారు. ఈ పనులన్నీ చేస్తూ రెండేళ్లలోపల దేశమంతా విస్తరించాలన్నది ఆశయం. ఒక్కో చదరపు కి.మీ.పరిధిలో 4జీ కన్నా పదిరెట్ల ఎక్కువ సంఖ్యలో పరికరాల్ని 5జీతో కనెక్ట్‌ చేయగల వెసులుబాటు ఉంది కనుక పని అంటూ మొదలెడితే త్వరగానే ఎక్కువ మందికి అందుబాటులోకి తేవచ్చు.

విదేశాలతో పోలిస్తే మనదేశంలో ప్రస్తుతం డేటా చాలా చౌకగా లభిస్తున్నట్లు లెక్క. ట్రాయ్‌ లెక్కల ప్రకారం దేశంలో 114 కోట్ల మందికి పైగా మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ వారి నుంచి వస్తున్న ఆదాయం మిగతా దేశాలకన్నా చాలా తక్కువ. ఏటికేడాదీ డేటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది కానీ నెలకు సగటు వినియోగదారు నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.178 మాత్రమేనట. 5జీ వచ్చినా ఛార్జీల్లో పెద్ద మార్పు ఏమీ ఉండే అవకాశం లేదనే ప్రభుత్వం అంటోంది.

ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హైఎండ్‌ టీవీలను కొనుక్కుంటున్నారు. వాటి పూర్తి సామర్థ్యం 5జీలోనే కన్పిస్తుంది. వీఆర్‌ గేమ్స్‌ ఆడేవారూ, క్రికెట్‌, టెన్నిస్‌ లాంటి మ్యాచ్‌లు చూసేవారూ అయితే వాటిల్లో పూర్తిగా లీనమైపోవచ్చు. ఏకంగా గ్రౌండ్‌లో ఉండి చూస్తున్న అనుభూతి చెందవచ్చు. పలురకాల డేటాని అత్యంత వేగంగా ప్రాసెస్‌ చేయడం వల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా రియల్‌టైమ్‌ అనుభవం లభిస్తుంది. ఇక, ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న స్మార్ట్‌హోమ్‌ కాన్సెప్ట్‌ని ఆచరణలో పెట్టవచ్చు. ఇంట్లోని పరికరాలన్నిటినీ అనుసంధానించి ఎక్కడ ఉన్నా ఫోనుతో వాటిని పనిచేయించే వెసులుబాటు వస్తుంది.

గత వందేళ్లలో వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందిందో 5జీ వచ్చాక పదేళ్లలోనే అంతకన్నా ఎన్నో రెట్లు అభివృద్ధిని చూడవచ్చంటున్నారు నిపుణులు. కొన్నాళ్లుగా చెబుతున్న స్మార్ట్‌ వైద్యం, టెలిమెడిసిన్‌ ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. పేషెంట్‌ ఇంట్లోనే ఉండి వీడియోలో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించవచ్చు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రికి వెళ్లక్కరలేదు. అంబులెన్స్‌ సర్వీసుల్ని అనుసంధానం చేయడం వల్ల అవసరమైనచోటికి త్వరగా చేరుకునేందుకూ, సమయం వృథా కాకుండా అంబులెన్స్‌లోనే వైద్యం మొదలెట్టేందుకూ వీలవుతుంది. ఏ ఊరో వెళ్లి హఠాత్తుగా జబ్బుపడినా భయపడనక్కర లేదు. తాము నివాసం ఉండేచోట ఎప్పుడూ చూపించుకునే ఆస్పత్రి నుంచి పేషెంట్‌ తాలూకు వైద్య చరిత్ర క్షణాల్లో అక్కడి ఆస్పత్రికి అందుతుంది. రోబోటిక్‌ హ్యాండ్స్‌ సాయంతో వైద్యులు దూరంగా మరో ప్రాంతంలో ఉన్న పేషెంట్‌కి రిమోట్‌ సర్జరీలు చేయగలుగుతారు. ఒంటి మీద ధరించే గ్యాడ్జెట్స్‌ అసలు సమస్య రాకముందే హెచ్చరించి అప్రమత్తం చేస్తాయి.

2030 నాటికి ఇంటర్నెట్‌లో అతి పెద్ద కంపెనీ అంటూ ఏదైనా ఉంటే అది విద్యారంగానికి చెందినదే అయివుంటుందని ఒక అంచనా. చదువు చాలారకాలుగా ప్రభావితమవుతుంది. విద్యార్థులు ఒకేసారి భిన్న కోర్సులు చదువుకోవచ్చు. ఇంటరాక్టివ్‌ వర్చువల్‌ ట్రైనింగ్‌ పలువృత్తుల్లో సాధ్యమవుతుంది. పొలంలో నాట్లు వేసే దశ నుంచి మన పళ్లెంలో ఆహారంగా మారే వరకూ వ్యవసాయరంగాన్ని మొత్తంగా డిజిటలైజ్‌ చేసేయొచ్చు. సెన్సార్లే అన్నిచోట్లా కీలక పాత్ర పోషిస్తాయి. నీటి పారుదల వ్యవస్థనీ, చీడపీడల నిర్వహణనీ, పంట కోతల్నీ… అన్నిటినీ అవే పర్యవేక్షిస్తాయి. కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాల వాడకం పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఎక్స్‌పైరీ డేట్‌తో సహా ప్యాక్‌ అయ్యి బయటకు వస్తాయి. నగదు వాడకమూ బ్యాంకుకు వెళ్లడమూ అనేవి పాతకాలపు జ్ఞాపకాలుగానే మిగులుతాయి. అసలు ఊరూరా బ్యాంకు కార్యాలయాల అవసరమే ఉండకపోవచ్చు. బీమా అంచనాలూ చెల్లింపులూ సులువవుతాయి. ఏ ప్రమాదమో జరిగితే క్షణాల్లో డ్రోన్లు అక్కడికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి అప్పటికప్పుడు పరిహారం చెల్లింపులు జరిగిపోయేలా చూస్తాయి.

పరిశ్రమల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగంతో ఉత్పాదకత విపరీతంగా పెరుగుతుంది. కృత్రిమమేధ సాయంతో తయారీలోని పలు దశలను ఆటోమేటెడ్‌ షెడ్యూలింగ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సామర్థ్యం రెండు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. కర్బనవాయువుల విడుదల కూడా తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో అయినా మాల్‌కి వెళ్లినా షాపింగ్‌ అంతా చేసి బిల్లింగ్‌ దగ్గరికి వచ్చేసరికి ఒకింత చికాకు తప్పదు. 5జీ వాడకం పెరిగితే ఒక చిన్న వాయిస్‌ కమాండ్‌తో పనైపోతుంది. షాపింగ్‌ చక్కని అనుభూతిగా మిగులుతుంది. పూర్తి శరీరాన్ని స్కాన్‌ చేసే హోలోగ్రాఫ్‌ వ్యక్తుల డిజిటల్‌ ఐడెంటిటీగా మారుతుంది. అప్పుడిక ప్రతిదానికీ ఆధార్‌, పాన్‌ తదితర వెరిఫికేషన్ల గోల ఉండదు. పనులన్నీ సులువుగా అయిపోతాయి.

ఇప్పుడిప్పుడే వింటున్న మెటావర్స్‌ నిత్యం అనుభవంలోకి వస్తుంది. షాపింగ్‌లో, సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌ మీటింగుల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి అమెరికాలో మనవడి గ్రాడ్యుయేషన్‌ వేడుకలో పాల్గొనవచ్చు. వరండాలో పడక కుర్చీలో కూర్చుని షిర్డీ ఆలయంలో హారతిని కళ్లారా చూడవచ్చు. వీడియోల్లాగా కాకుండా అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగించడమే మెటావర్స్‌ ప్రత్యేకత. విద్యుత్‌ వాహనాల వినియోగం, నిర్వహణ తేలికవుతుంది. ఛార్జింగ్‌ స్టేషన్లను వాహనాలకు అనుసంధానం చేయొచ్చు. డ్రైవరు లేకుండా కార్లు నడపడమూ సాధ్యమవుతుంది. ఇప్పటివరకూ ఒక్కో పనికి ఒక్కో ఆప్‌ని వాడాల్సి రావడం వల్ల ఫోనులో చాలా ఆప్స్‌ని పెట్టుకోవాల్సి వస్తోంది. పలు సేవలను ఒకేచోట అందించే సూపర్‌ ఆప్‌లను తయారుచేసినా డేటా వేగం సహకరించక అంతగా ఆదరణ పొందడం లేదు. 5జీతో ఆ బాధ తప్పుతుంది. సూపర్‌ఆప్‌తో సులువుగా పనులు చేసుకోవచ్చు. కొన్ని నగరాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి నగరాల్లో విద్యుత్తు, నీటిసరఫరా, వీధిలైట్లు, ట్రాఫిక్‌, డ్రెయినేజీ, వరద కాలువలు… లాంటివన్నీ నిర్వహించడం 5జీ కనెక్టివిటీ వల్ల సులువవుతుంది.

త్వరలో దేశంలో 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 5జీ వచ్చాయి. మరిన్ని కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక టెలికాం రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న రిలయన్స్‌ జియో కూడా 5G సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అక్టోబర్ నుండి దేశంలో 5G మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అక్టోబర్ నాటికి 5G మొబైల్ సేవను ప్రారంభిస్తామని, ఆ తర్వాత దేశంలోని అన్ని పెద్ద, చిన్న నగరాలకు ఈ సర్వీసులను విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్రకటన తర్వాత దేశంలోని అనేక మొబైల్ తయారీదారుల మధ్య 5G మొబైల్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి పోటీ ప్రారంభమైంది. రిలయన్స్ జియో తన మొట్టమొదటి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ సేవలతో పోలిస్తే ఎన్నో వందల రెట్లు అధిక వేగంతో పనిచేసే 5జీతో స్థిరాస్తి రంగం రూపురేఖలే పూర్తిగా మారనున్నాయని యువ బిల్డర్లు అంటున్నారు. ఇప్పటితో పోలిస్తే నిర్మాణాల వేగం గణనీయంగా పెరుగుతుందని.. సైట్‌లో పనుల పర్యవేక్షణ, కొనుగోలుదారుల సందర్శనలో కొత్త మార్పులు చూస్తారని.. ఈ మార్పులకు సిద్ధపడితేనే పోటీలో ముందుంటామని వారు చెబుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. టెలికాం రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తోన్న 5జీ టెక్నాలజీతో 2025 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకొచ్చే అవకాశం ఉందని టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ అంచనా.