Cricket: బీసీసీఐపై యువరాజ్ సంచలన ఆరోపణలు

Yuvaraj Min

Yuvaraj Min

2007లో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.

2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది ఛాపెల్ వర్సెస్ సచిన్ వివాదంలా మారడటంతో టీమ్‌లో తానొక్కడినే సచిన్‌కు మద్దతు పలికానని యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాను సచిన్‌కు మద్దతు ఇవ్వడం బీసీసీఐలోని కొందరు అధికారులకు నచ్చలేదని… దీంతో తనను కాకుండా టీమ్‌లో వేరేవాళ్లను కెప్టెన్‌గా చేయాలని సెలక్టర్లు అభిప్రాయపడటంతో తనకు కెప్టెన్సీ దక్కలేదని యువరాజ్ వాపోయాడు. తర్వాత వైస్ కెప్టెన్సీ నుంచి తనను తొలగించారని గుర్తుచేసుకున్నాడు.

ఆ సమయంలో టీమ్‌లో సెహ్వాగ్ లేకపోవడంతో తనకే కెప్టెన్సీ వస్తుందని భావించానని.. కానీ ఛాపెల్ వివాదం తనకు కెప్టెన్సీ దక్కకుండా చేసిందని యువరాజ్ పేర్కొన్నాడు. అయితే ధోనీ అద్భుతంగా కెప్టెన్సీ వహించాడని కొనియాడాడు. తనకు కెప్టెన్సీ దక్కడంలో తనకు ఎలాంటి అసూయ లేదన్నాడు. కాగా 2007 ప్రపంచకప్‌లో యువరాజ్ మంచి ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ చేయగా.. యువరాజ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Sehwag: గెలవాల్సిన మ్యాచ్‌ను వాళ్లు ముంబైకి అప్పచెప్పారు