Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!

Subhadeep Ghosh India Coach

Subhadeep Ghosh India Coach

Who Is Subhadeep Ghosh: భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే చర్చ జోరుగా సాగుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అందులో మాజీ దేశవాళీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దాంతో ఎవరీ సుభదీప్ ఘోష్? అని టీమిండియా ఫాన్స్ తెగ వెతుకుతున్నారు.

ఎవరీ సుభదీప్ ఘోష్?:

సుభదీప్ ఘోష్ అసోంలోని దిగ్‌బోయ్‌లో 1968లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్ బౌలర్‌గా రాణించాడు. అతడు అసోం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 1994-95 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఘోష్.. తన కెరీర్‌లో 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 316 పరుగులు, లిస్ట్-ఏలో 307 పరుగులు చేశాడు. 2004లో చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఘోష్.. 2005తో లిస్ట్-ఏ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

కోచ్‌గా ప్రత్యేక గుర్తింపు:

ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత సుభదీప్ ఘోష్ కోచింగ్ వైపు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న కాలం నుంచి.. గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా భారత క్రికెట్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే ఇండియా-ఏ, భారత అండర్-19 జట్లతో కూడా పనిచేశాడు. 2024 అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కూడా ఘోష్ సభ్యుడిగా ఉన్నాడు.

ఐపీఎల్‌లోనూ విజయవంతమైన ప్రయాణం:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా సుభదీప్ ఘోష్‌కు మంచి అనుభవం ఉంది. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీజన్‌లో కోచింగ్ బృందంలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. దేశవాళీ, జాతీయ, ఐపీఎల్ స్థాయిల్లో విస్తృత అనుభవం ఉండటంతో టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో ఆయన ముందంజలో ఉన్నట్లు సమాచారం.

బీసీసీఐ తుది నిర్ణయం ఎప్పుడు:

టీ దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులతో చర్చలు కొనసాగుతున్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త ఫీల్డింగ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో సుభదీప్ ఘోష్‌నే ప్రధాన ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అతడే దాదాపుగా ఫిక్స్ అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.