రేపటి నుంచి పాకిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో భాగంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్ కొనసాగుతుందని విండీస్ బోర్డు వెల్లడించింది.
Read Also: రోహిత్ శర్మ సారథిగా రాణిస్తాడు: గంగూలీ
ఇటీవల వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనను ముగించుకుని నేరుగా పాకిస్థాన్ వెళ్లింది. కరాచీ వేదికగా డిసెంబర్ 13న పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లకు చేసిన కరోనా టెస్టులలో ముగ్గురికి కరోనా రావడంతో ఆ జట్టు ఆందోళన చెందుతోంది. దీంతో సిరీస్పై నీలినీడలు కమ్ముకోగా వెస్టిండీస్ బోర్డు స్పందించి సిరీస్ జరుగుతుందని స్పష్టం చేసింది.
