Gambhir Haaye Haaye: కివీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమి.. గంభీర్‌పై స్టేడియంలో ఫ్యాన్స్ ఫైర్.. కోహ్లీ లుక్స్ వైరల్

  • న్యూజిలాండ్ చేతిలో 2-1తో ఓడిపోయిన భారత్..
  • సిరీస్ ఓటమితో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మరింత ఒత్తిడి..
  • గంభీర్ హాయే హాయే” అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. కోహ్లీ వీడియో వైరల్
Gambir

Gambir

Gambhir Haaye Haaye: భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ 2-1తో అతిథి జట్టు న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఆ తర్వాత రెండు, మూడో వన్డేల్లో వరుసగా పరాజయాలు పాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఓటములతో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 93, 23, 124 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మాత్రమే విమర్శల నుంచి కొంతవరకు తప్పించుకున్నాడు. సిరీస్ ఓటమి ఫలితంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన పదవీకాలంలో మరో హోం సిరీస్ ఓటమి చేరడం అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. మూడో వన్డే తర్వాత ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో స్టేడియంలోని కొంతమంది అభిమానులు “గంభీర్ హాయే హాయే” అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు విని విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కూడా ఆశ్చర్యానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Snow Storm: మంచు తుఫాన్ బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొన్న 100కి పైగా వాహనాలు(వీడియో)

అయితే, కేవలం స్టేడియంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలి కాలంలో జట్టు పేలవ ఫలితాలు, అలాగే, మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పట్ల గంభీర్ వ్యవహరించిన తీరుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నారు అని జట్టు మేనేజ్‌మెంట్ చెప్పడాన్ని కూడా అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. ఫలితాలు మాత్రం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఆ వ్యాఖ్యలు అర్థం లేనివిగా మారుతున్నాయని విమర్శిస్తున్నారు. మరోవైపు, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ వన్డేల్లో ఇటీవలి ప్రదర్శనపై కూడా చర్చ కొనసాగుతోంది. అతని రికార్డులను దేశవాళీ 50 ఓవర్ల టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌తో పోల్చుతూ సెలెక్టర్ల నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గిల్‌ను ఎంపిక శాంసన్‌ను పక్కన పెట్టడంపై సెలెక్షన్ కమిటీపై కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

Read Also: Marriage Dates in 2026: ప్రారంభమైన పెళ్లిళ్ల సీజన్‌.. 2026లో ముహూర్తాలు ఇవే..

ఇక, ఈ సిరీస్ విజయంతో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలుచుకుంది. అంతేకాదు, గత ఏడాది టెస్టు సిరీస్‌లో టీమిండియాపై 3-0తో వైట్‌వాష్ చేయడం కూడా కలిపి చూస్తే, బ్లాక్‌క్యాప్స్ భారత్ పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించాయి. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, 2023 వరల్డ్‌కప్ ఫైనలిస్టైన భారత్ ప్రస్తుతం సరైన దిశలో ప్రయాణించడం లేదన్న భావన అభిమానుల్లో బలంగా ఉంది. జట్టు సమతుల్యం, కెప్టెన్సీ, కోచింగ్ విధానాలు, సెలెక్షన్ పాలసీలపై సమగ్ర పునర్విమర్శ అవసరమన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.