Vaibhav Sooryavanshi Set to Break Sachin Tendulkar’s Record: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు బుడ్డోడిని త్వరలోనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత పురుషుల జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు 70 రోజులు మాత్రమే. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరిగే ఈ సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. సచిన్ 1989లో పాకిస్థాన్పై 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు బుడ్డోడికి ఇంకా ఏడాది సమయం ఉంది.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. అతడి స్ట్రైక్రేట్ 237.30గా ఉండటం విశేషం. ఈ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత సీజన్లలో ఒకటిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడు జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలో జరగనున్న ఇండియా-ఏ త్రైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. వైభవ్ డెబ్యూపై బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
