Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • మూడో టీ20లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్
  • మరోసారి అందరి ప్రశంసలు అందుకున్న వైభవ్
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు
Vaibhav Sooryavanshi On Mom

Vaibhav Sooryavanshi On Mom

Vaibhav Sooryavanshi Reaction: జింబాబ్వే పర్యటనలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. భారత్‌కు 35 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో బుడ్డోడు 151 రన్స్ చేశాడు. వైభవ్ అద్భుత బ్యాటింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా అందుకున్నాడు.

నాపై పూర్తి నమ్మకం ఉంచారు:

మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ‘గత మూడు రోజులుగా మా ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. నేను అండర్-19 ప్రపంచ కప్ 2026 హరారేలో ఆడాను. అందుకే ఈ మైదానంలో ఆడటం నాకు చాలా ఇష్టం. కెప్టెన్, కోచ్‌లు, జట్టులోని ప్రతి ఒక్కరూ నాపై పూర్తి నమ్మకం ఉంచారు. వారి మద్దతు వల్లే నేను స్వేచ్ఛగా ఆడగలిగాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో నేను ఎలా ఆడనో, ఇక్కడ కూడా అదే విధంగా ఆడాడనికి ప్రయత్నించాను. ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడమే నా లక్ష్యం. ఒకసారి మంచి స్టార్ట్ లభిస్తే దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చాలని అనుకున్నాను. అదే నా ఆలోచన’ అని వైభవ్ వివరించాడు.

దూకుడుగా ఆడడానికే ప్రయత్నిస్తా:

తాను మ్యాచ్‌లో ఆడే షాట్లు అన్నీ నెట్స్‌లో సాధన చేసినవేనని వైభవ్ చెప్పాడు. ‘ప్రాక్టీస్‌లో ఏ షాట్స్ ఆడుతానో, మ్యాచ్‌లో కూడా అవే షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తాను. సాధనలో చేసినదాన్ని మ్యాచ్‌లో అమలు చేయడమే నా విధానం. భారత్ తరఫున జింబాబ్వేపై పూర్తి సిరీస్ ఆడాను. కెరీర్ ఆరంభంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకోవడంతో నా కల నిజమైంది. రెండు అవార్డులు ఒకేసారి అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. టీమిండియా తరఫున ఆడడం ఎప్పుడూ బాగుంటుంది. ఇకపై కూడా ఇలానే దూకుడుగా ఆడడానికే ప్రయత్నిస్తా’ అంటూ బుడ్డోడు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

సిరీస్ విజయంలో కీలక పాత్ర:

జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన నిలకడను ప్రదర్శించాడు. తొలి టీ20లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం (18 బంతుల్లో 50), రెండో మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (9బంతుల్లో 20), మూడో మ్యాచ్‌లో మరో తుఫాన్ ఇన్నింగ్స్‌ (49 బంతుల్లో 81 పరుగులు)తో జట్టుకు బలమైన ఆరంభాలు అందిస్తూ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఆటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భవిష్యత్ భారత క్రికెట్‌కు మరో స్టార్‌గా వైభవ్ ఎదుగుతున్నాడనే అభిప్రాయాన్ని తన ప్రదర్శనతో మరింత బలపరిచాడు.