Vaibhav Sooryavanshi Reaction on 1st T20I Fifty: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. గురువారం జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. దాంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా బుడ్డోడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు), సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు) రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇలాంటి ఇన్నింగ్స్తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది:
బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. కెరీర్ ప్రారంభ దశలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు. ‘కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే తర్వాతి మ్యాచ్లకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ మ్యాచ్లో నేను పూర్తిగా నా జోన్లోనే ఆడాను. నా బలాలపై నమ్మకం ఉంచుకుని సహజమైన ఆటనే ఆడాను. గత మూడు మ్యాచ్ల్లో పెద్దగా పరుగులు చేయలేదు. ఈరోజు ఫిఫ్టీ మార్క్ అందుకున్నా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
హరారే ఎప్పుడూ ప్రత్యేకమే:
హరారే తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన వేదిక అని వైభవ్ పేర్కొన్నాడు. ‘హరారే స్పోర్ట్స్ క్లబ్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ చేశాను. ఇప్పుడు అదే వేదికపై టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేశాను. అందుకే నాకు ఈ మైదానం ఎంతో ప్రత్యేకం’ అని బుడ్డోడు తెలిపాడు. హరారే మైదానంలో ఈ ఏడాది అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై 80 బంతుల్లో 175 పరుగులు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
సక్సెస్ను తలకెక్కించుకోను:
ఈ విజయాన్ని తాను తలకెక్కించుకోనని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ‘కొన్ని మైదానాలు మనకు బాగా కలిసొస్తాయి. కానీ నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకోను. ఎక్కడ అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాలని, ప్రతి మ్యాచ్లో నిలకడగా రాణించాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సక్సెస్ను తలకెక్కించుకోను. కామ్గా ఉంది నా సహజ ఆటనే ఆడుతా. నా ప్రయాణంలో నన్ను నమ్మి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, కోచ్లు, ప్రతి ఒక్కరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తున్నాను’ అని భావోద్వేగంగా చెప్పాడు.

