Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్‌ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

Viral News1

Viral News1

Viral News: మీ అభిమాన జట్టును చూసేందుకు ఎంత దూరమైనా వెళ్లొచ్చు. కానీ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి, తిరిగి వెళ్లేటప్పుడు ఆ దేశానికే మనసు ఇచ్చేసి రావడం చాలా అరుదు. యూకేకు చెందిన ఓ మహిళ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె భారత్‌కు వచ్చింది క్రికెట్ కోసం. కానీ తిరిగి వెళ్లేటప్పుడు తనతో తీసుకెళ్లింది మనుషుల ప్రేమను, ఆతిథ్యాన్ని, మరపురాని జ్ఞాపకాలను.

హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన ఎరికా మోరిస్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆమెకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రేమే ఆమెను ఏకంగా 6,880 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూకే నుంచి బెంగళూరుకు తీసుకొచ్చింది. కేవలం 72 గంటల పాటు మాత్రమే ఉండే ఈ ఒంటరి ప్రయాణం కోసం ఆమె విమాన టికెట్లు బుక్ చేసుకుంది. ఒక మ్యాచ్ చూసి తిరిగి వెళ్లాలన్నదే ఆమె ఉద్దేశం.

×
×
Ad

తర్వాత తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్న ఎరికా, ఈ ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు తనకే ఇది కొంచెం విచిత్రంగా అనిపించిందని చెప్పింది. ఎన్నో గంటల విమాన ప్రయాణం, తక్కువ నిద్ర, ఎప్పుడూ వెళ్లని దేశంలో ఒంటరిగా తిరగడం వంటి అంశాలు మొదట కాస్త భయపెట్టాయని పేర్కొంది. అయితే భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత తనకు ఎదురైన అనుభవం మాత్రం ఊహలకు మించినదిగా మారిందని వెల్లడించింది.

భారత్‌లో తనకు ఎదురైనది కేవలం క్రికెట్ కాదని, అంతకంటే గొప్పదేదో అని ఎరికా రాసుకొచ్చింది. తన ప్రయాణంలో ఎదురైన అపరిచితులు చూపించిన ఆప్యాయతను ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. ఎక్కడికి వెళ్లాలో చెప్పడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, అవసరమైన సూచనలు చేయడం, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా సహాయం చేయడం వంటి ఎన్నో సందర్భాల్లో భారతీయులు తనకు అండగా నిలిచారని తెలిపింది. పూర్తిగా కొత్త దేశంలో ఉన్నాననే భావనను వారు ఒక్క క్షణం కూడా కలగనివ్వలేదని పేర్కొంది.

ముఖ్యంగా ఇద్దరు ఆర్సీబీ అభిమానులు తనకు మ్యాచ్ టికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం ప్రయాణంలో సహాయం చేశారని ఎరికా చెప్పింది. వారిలో ఒకరు తన భార్యతో కలిసి ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని వెల్లడించింది. ఆ ప్రేమ, ఆతిథ్యం జీవితాంతం గుర్తుండిపోతుందని ఆమె భావోద్వేగంగా రాసింది.

మైదానంలో కూడా ఆమె ఊహించినదానికంటే గొప్ప అనుభవమే ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో స్టేడియం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల అరుపులు, జట్టు పట్ల వారి అభిమానం, రంగురంగుల వాతావరణం, ఉత్సాహం అన్నీ కలిసి తాను కేవలం ఒక క్రీడను చూస్తున్నాననే భావన కాకుండా, ప్రజలు జీవించే ఒక భావోద్వేగంలో భాగమయ్యాననే అనుభూతిని కలిగించాయని ఆమె చెప్పింది.

ఈ 72 గంటల ప్రయాణం ముగిసే సమయానికి ఎరికా కేవలం ఒక మ్యాచ్ జ్ఞాపకంతో కాదు, భారత్‌తో ఒక భావోద్వేగ బంధంతో తిరిగి వెళ్లింది. ఒక అనుభవాన్ని వెతుక్కుంటూ వచ్చానని, కానీ తనలోని ఒక భాగాన్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాననే భావనతో తిరిగి వెళ్తున్నానని ఆమె రాసింది.

ఎరికా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, భారతీయుల ఆతిథ్యం మరోసారి ప్రపంచానికి కనిపించిందంటూ అనేక మంది స్పందిస్తున్నారు. ఒక క్రికెట్ మ్యాచ్ కోసం ప్రారంభమైన ప్రయాణం, చివరకు భారత్‌పై ప్రేమలేఖగా మారడం విశేషం.