VVS Laxman’s Revelation Stuns Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ కొందరు వరుస గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా పలు సిరీస్లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఓఈ అధిపతి, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సమస్యలు ఎందుకు వస్తున్నాయో:
సీఓఈలో కీలక వైద్య, స్పోర్ట్స్ సైన్స్ నిపుణుల నియామకంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. కొందరు ప్రముఖ నిపుణులతో చర్చలు పూర్తయినప్పటికీ.. చివరి నిమిషంలో వారు బీసీసీఐతో కలిసి పనిచేసే ప్రతిపాదనను తిరస్కరించారని చెప్పారు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి అత్యుత్తమ వైద్య నిపుణులను నియమించుకోవడంలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు.
ఆశ్చర్యంగా ఉంది:
మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ… ‘బీసీసీఐ వద్ద భారీ ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆటగాళ్లు ఐపీఎల్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి భారత్కు వస్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచస్థాయి ఫిజియోథెరపిస్టులు, మెడికల్ నిపుణులను బీసీసీఐతో కలిసి పనిచేసేలా ఒప్పించలేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిపుణులకు మంచి కాంట్రాక్టులు, భారీ పారితోషికాలు అందించే అవకాశం ఉన్నప్పటికీ నియామకాలు పూర్తికాకపోవడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. టీమిండియాపై గాయాల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వరుసగా మ్యాచ్లకు దూరమవుతుండటం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో బుమ్రా ఆడకపోవడంతో భారత జట్టు 387 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న సమయంలో గాయం కారణంగా అతడి గైర్హాజరు జట్టుపై ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా బీసీసీఐ, వైద్య బృందం, సంబంధిత నిపుణులు కలిసి తక్షణ పరిష్కారం కనుగొనాలి’ అని సూచించాడు.
చివరి నిమిషంలో తిరస్కరణ:
ఇదే సమయంలో సీఓఈలో హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ నియామకం విషయంలో ఎదురైన పరిణామాలను వీవీఎస్ లక్ష్మణ్ వివరించారు. గతంలో నితిన్ వైదొలిగిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన వ్యక్తి కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ప్రముఖ నిపుణుడు ఆండ్రూ లీపస్తో దాదాపుగా ఒప్పందం ఖరారైనప్పటికీ.. చివరి నిమిషంలో కుటుంబ కారణాలను చూపిస్తూ ఆయన వెనక్కి తగ్గినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. అంతేకాకుండా డాక్టర్ దిన్షా పార్దీవాలా, డాక్టర్ ఆశిష్ సోని, డాక్టర్ రోహన్ ఖవ్తే తదితరులతో కలిసి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహించినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఐదుగురు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి, వారిలో ఒక ఆస్ట్రేలియన్ నిపుణుడిని మొదటి స్థానంలో ఎంపిక చేసినప్పటికీ.. బెంగళూరుకు మారడం సాధ్యం కాదని చెబుతూ ఆయన కూడా చివరి నిమిషంలో ప్రతిపాదనను తిరస్కరించినట్లు వివరించారు.
భారత జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం:
భారత క్రికెట్లో వరుసగా కీలక ఆటగాళ్లు గాయపడుతున్న సమయంలో సీఓఈలో నిపుణుల నియామకంపై హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గాయాల నిర్వహణ, రిహాబిలిటేషన్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మరింత బలమైన వ్యవస్థ అవసరమని మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో చిన్నపాటి లోపం కూడా భారత జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

