BCCI On Team India Fielding Coach Subhadeep Ghosh: టీమిండియా సీనియర్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్ను నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అగార్కర్ తన పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అజిత్ అగార్కర్ పదవీకాలం మరికొద్ది వారాల్లో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన బీసీసీఐని కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుత పదవీకాలం పూర్తయిన వెంటనే చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశాన్ని బీసీసీఐకి అగార్కర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అగార్కర్, బీసీసీఐ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అగార్కర్ చివరి సెలక్షన్ సమావేశానికి అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ వైట్బాల్ సిరీస్లకు భారత జట్టును ప్రకటించిన సమావేశమే అగార్కర్ చివరి సెలక్షన్ మీటింగ్ కానుంది.
అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ టీమిండియా క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి పార్థివ్ ప్రధాన అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వెల్లడికానుంది. సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు జూనియర్ సెలక్షన్ కమిటీలోనూ మార్పులు జరగనున్నాయి. జూనియర్ సెలక్షన్ కమిటీలోని మొత్తం ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ చేపట్టింది. ఈ పదవుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
మరోవైపు టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా సుభదీప్ ఘోష్ నియామకం కూడా ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నట్లు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫీల్డింగ్ కోచ్గా ఉన్న ఘోష్ను భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా స్వల్పకాలికంగా నియమించినట్లు తెలిపారు. ‘ఘోష్ పనితీరును పరిశీలిస్తాం. టీమ్ మేనేజ్మెంట్కు చెందిన సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఆయన సేవలను కొనసాగించాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.

