Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?

  • టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు
  • టీమిండియా కోచింగ్ స్టాఫ్‌ నుంచి ఒకరు అవుట్
  • ఐపీఎల్ ఫ్రాంచైజీతో ఇప్పటికే చర్చలు
Team India Coach

Team India Coach

Team India Coach Set to Leave: టీ20 క్రికెట్‌లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ స్టాఫ్‌లో ఒకరు త్వరలోనే తన పదవికి వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. సదరు కోచ్ ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీమిండియా నుంచి ఆ కోచ్ నిష్క్రమణతో సహాయక సిబ్బందిలో భారీ ప్రక్షాళన జరిగే అవకాశముందని సమాచారం.

త్వరలో భారత జట్టును వీడే అవకాశం:

ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న మరో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు కూడా త్వరలో భారత జట్టును వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న కోచ్ ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. గంభీర్ 2024 జూలైలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటే, మోర్నీ మోర్కెల్ సహాయక సిబ్బందిలో చేరారు. టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. అభిషేక్ నాయర్ 2025లోనే భారత జట్టు కోచింగ్ స్టాఫ్ నుంచి తప్పుకున్నారు. తాజాగా మరో కీలక సభ్యుడు కూడా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

బీసీసీఐతో ‘2+1’ విధానంలో ఒప్పందం:

టీమిండియాను వీడనున్న సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు బీసీసీఐతో ‘2+1’ విధానంలో ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం. ప్రస్తుతం రెండేళ్ల కాంట్రాక్ట్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే అతడి నిష్క్రమణకు అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టీమిండియా వరుసగా ఓడిపోయినప్పటికీ.. ఈ పరాజయాలకు, సదరు కోచ్ నిష్క్రమణకు సంబంధం లేదని నివేదిక పేర్కొంది. కాంట్రాక్ట్ పరిస్థితులు, కొత్త అవకాశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారీ ప్రక్షాళన తప్పదా?:

గౌతమ్ గంభీర్, ర్యాన్ టెన్ డస్కాటే, మోర్నీ మోర్కెల్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అనూహ్య టీ20 సిరీస్ పరాజయాలతో జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో టీమిండియా కోచింగ్ వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులు కీలకంగా మారనున్నాయి. ఒక కోచ్ నిష్క్రమణతో మొదలయ్యే ఈ మార్పులు.. భారీ ప్రక్షాళనకు దారితీస్తాయా?, గంభీర్ సహాయక బృందంలో కొత్త ముఖాలు చేరతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.