NTV Telugu Site icon

Inzamam-ul-Haq: భారత్ ఫైనల్‌కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..

Inzamam Ul Haq

Inzamam Ul Haq

Inzamam-ul-Haq: టీ 20 ప్రపంచకప్ -2024లో టీమిండియా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు టోర్నీలో ఒక్క మ్యా్చ్ ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కి చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఆ జట్టును చిత్తుచేసింది. భారత స్పిన్నర్లకు ఇంగ్లీస్ బ్యాటర్లు దాసోహమయ్యారు. కఠినంగా ఉన్న గయనా పిచ్‌పై భారత్ 171/7 స్కోర్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 103 రన్స్‌కే ఆల్ అవుట్ అయింది. దీంతో రేపు జరగబోయే ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది.

ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రదర్శనపై పాకిస్తాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఈ టోర్నీలో అత్యంత అవమానకరమైన రీతిలో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. చివరకు పసికూన అమెరికా చేతిలో ఓడిపోయింది. భారత్‌తో జరిగి మ్యాచులో కూడా మన బౌలర్ల ధాటికి నిలబడలేక తక్కువ స్కోర్‌ని ఛేజ్ చేయలేకపోయారు. అయితే, ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం భారత ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకోవడం వదిలిపెట్టి కోడిగుడ్డుపై ఈకలు పీకే పనిలో ఉన్నారు.

Read Also: Airtel: నిన్న జియో, నేడు ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా బాల్ టాంపరింగ్‌కి పాల్పడుతుందనే పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సెమీస్‌లో ఇంగ్లాండ్ పై గెలవడంతో మరోసారి నోరుపారేసుకుున్నాడు. ప్రపంచ కప్ షెడ్యూల్‌ను విమర్శించాడు, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారతదేశం సెమీ-ఫైనల్ వేదికను ముందే నిర్ణయించింది. ఇది అన్యాయమని ఇంజమామ్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా అలాంటి ప్రయోజనాలను పొందలేదని చెప్పాడు భారత్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోవడం కూడా భారత్‌కు అనుకూలంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఇంజమామ్ ఆరోపించారు.

పాకిస్తాన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. రెండు సెమీఫైనల్స్ మ్యాచుల్లో భారత్-ఇంగ్లాండ్ గేమ్‌కి మాత్రమే రిజర్వ్ డే లేదు, ఒక వేళ ఆటను రద్దు చేస్తే భారత్ ఫైనల్‌కి వెళ్తుంది. భారత్‌కి ఒక్కో మ్యాచ్‌కి వేర్వేరు నిబంధనలు ఉ న్నాయని అన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కూడా ఏమీ చేయలేనంత శక్తిలో భారత్‌ ఉందని, క్రికెట్‌ని ఒక శక్తి మాత్రమే నడుపుతోందని అన్నారు. బీసీసీఐకి ఉన్న ధనశక్తి కారణమని అన్నారు.