NTV Telugu Site icon

T20 World Cup 2024: అతడి కంటే బాగా ఎవరు ఆడగలరు.. బీసీసీపై అంబటి రాయుడు ఆగ్రహం!

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu Supports Rinku Singh: టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఫినిషర్‌ రింకు సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. గతేడాదిగా భారత టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అద్భుత ప్రదర్శన చేస్తున్న రింకూను బీసీసీఐ సెలెక్టర్లు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు. రింకూకు 15 మంది జట్టులో చోటివ్వకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు బీసీసీ సెలెక్టర్లపై మండిపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు కూడా బీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రింకు సింగ్‌ను టీ20 ప్రపంచకప్‌ 2024కు ఎంపిక చేయకపోవడం చూస్తుంటే.. క్రికెటింగ్ సెన్స్ కంటే గణంకాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం అయిందని అంబటి రాయుడు అన్నాడు. 16, 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో భారత జట్టులో ఎవరు బ్యాటింగ్ చేస్తారని ప్రశ్నించాడు. ‘రింకూ సింగ్‌ను తప్పించడం చూస్తే.. క్రికెట్ సెన్స్‌పై గణాంకాలదే ఆధిపత్యం అని అర్ధమవుతోంది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా తప్ప.. ఎవరూ కూడా రింకూలా 16, 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయలేదు. రింకూను టీమిండియా చాలా మిస్ అవుతుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ కంటే క్రికెటింగ్ సామర్థ్యం ముఖ్యం’ అని రాయుడు ట్వీట్ చేశాడు.

Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?

ఐపీఎల్ 2024 ప్రదర్శనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టడానికి కారణం అని తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలలే రింకూను పక్కనపెట్టడానికి కారణం. మరోవైపు శివమ్ దూబే విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా రింకూ ఎంపికకు ఆడ్డుపడ్డాయనే చెప్పాలి. దూబే బౌలింగ్ కూడా చేస్తాడన్న విషయం తెలిసిందే.