టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వరుస విజయాలతో సూపర్-8కు అజేయంగా చేరుకున్న జింబాబ్వే.. ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేశాడు. సూపర్-8 మ్యాచ్ల కోసం భారత్ చేరుకున్న తర్వాత పరిస్థితులను అంచనా వేసి వ్యూహం సిద్ధం చేస్తామని తెలిపాడు. 23న జరిగే మ్యాచ్ నిజమైన పోరాటమని, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తమ శక్తిమేరకు పోరాడతామన్నాడు. ఏమో మూడు మ్యాచ్లలో రెండింటిని గెలుస్తాం కావొచ్చు అని రజా ధీమా వ్యక్తం చేశాడు.
శ్రీలంక మ్యాచ్ అనంతరం సికందర్ రజా మాట్లాడితే… ‘సూపర్ ఎయిట్లో తొలి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడూ ముందున్న లక్ష్యం పైనే దృష్టి పెట్టుతున్నాం. గత రెండు వారాల్లో మా జట్టు చూపించిన శ్రమ అద్భుతం. నిజం చెప్పాలంటే మేము సూపర్-8 చేరుతామని ఎవరూ ఊహించలేదు. అభిమానుల మనసులు గెలుచుకుని, వారి గౌరవం పొందడం చాలా గొప్ప విషయం. టాస్ ఓడిన వెంటనే నా జట్టు సబ్యులకు ఒకటే చెప్పాను.. మనం మంచి క్రికెట్ ఆడితే, టాస్ ఫలితం మన మైండ్సెట్పై ఎలాంటి ప్రభావం చూపదు?. పరిస్థితి ఏదైనా సరే మనం మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు అవే వస్తాయి’ అని చెప్పాడు.
‘మిడిల్ ఓవర్లలో నేను బౌలింగ్ చేసినప్పుడు ఓ విషయం గమనించాను. ఫింగర్ స్పిన్నర్లకు పెద్దగా టర్న్ దొరకడం లేదు కానీ.. రిస్ట్ స్పిన్నర్లకు కొంచెం టర్న్ లభిస్తోంది. లంకలో ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు, ఒక రిస్ట్ స్పిన్నర్ ఉన్నారు. అందుకే వారిపై ఒత్తిడి తీసుకురాగలమనిపించింది. మిగతాది మన ఆటపై ఆధారపడి ఉంటుంది. ఇన్నింగ్స్ చివర్లో లంక కాస్త తక్కువ పరుగులు చేసింది. లంక ఆరంభించిన తీరు చూస్తే 10 పరుగులు తక్కువే చేశారు. మేము గెలవగలమని నమ్మకం వచ్చింది. మ్యాచ్ను ముగించిన టోనీ, బెన్నీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఛేజ్ చేస్తున్నప్పుడు లక్ష్యం బోర్డుపై ఉంటుంది కాబట్టి ప్లాన్ స్పష్టంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన ఆటగాళ్లను పంపే సామర్థ్యం మాకు ఉంది. ఛేజ్ సమయంలో మేము బ్యాటింగ్ ఆర్డర్ను నాలుగు సార్లు మార్చాం’ అని సికందర్ రజా పేర్కొన్నాడు.
Also Read: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం!
‘మేము 21న భారత్ చేరుకుంటాం. 22న ప్రాక్టీస్ చేస్తాం. పిచ్ పరిస్థితులు చూసిన తర్వాత మా ఆటపై స్పష్టత వస్తుంది. 23న అసలైన పోరు. మేము మా సహజమైన ఆటను ప్రదర్శిస్తాం. తర్వాత ఫలితం మా చేతులో ఉండదు. ఓటమి లేకుండా సూపర్-8కి చేరడం గర్వపడే విషయం. సూపర్-8లో మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే ఏమవుతుందో ఎవరికి తెలుసు. నేను ఎప్పుడూ చెప్పేదే.. ప్రతి ఒక్కరికీ అండర్డాగ్ కథలు అంటే ఇష్టం’ అంటూ రజా సూపర్-8కు ముందు హెచ్చరికలు జారీ చేశాడు.
