టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్పూర్లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కు షాక్ తగిలింది.
వాస్తవానికి తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అందుబాటులో ఉంటే.. ఇషాన్ కిషన్కు అవకాశం వచ్చేది కాదు. అబ్డొమినల్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్.. తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్నప్పటికీ.. చివరి రెండు మ్యాచ్లకు ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ కిషన్ను నంబర్–3లో ఆడించాలని నిర్ణయించింది. నంబర్–3 స్థానం కోసం శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ రూపంలో రెండు ఆప్షన్లు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వరల్డ్కప్ జట్టులో ఉన్న ఇషాన్కే ప్రాధాన్యం ఇచ్చినట్లు సూర్యకుమార్ చెప్పాడు. నంబర్–4 లేదా 5 స్థానాల పరిస్థితి వేరేలా ఉండేదని, తిలక్ లేని నేపథ్యంలో ఇషాన్నే బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.
Also Read: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాపై టీ20 ఆడాడు. గతంలో టీమ్ మేనేజ్మెంట్తో జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఇషాన్ను సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి తప్పించారు. చైర్మన్ అజిత్ అగార్కర్, అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో జరిగిన పరిణామాలే దీనికి కారణమని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ అద్భుత ప్రదర్శనతో జట్టులో తిరిగి స్థానం సంపాదించాడు. జార్ఖండ్ తరఫున ఆడిన ఇషాన్ 10 మ్యాచ్ల్లో 197.33 స్ట్రైక్రేట్తో 517 పరుగులు చేశాడు. ఇషాన్కు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. నంబర్–3లో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. మళ్లీ టీమిండియాలో స్థిరమైన స్థానం దక్కే అవకాశం ఉంది.
