Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India T20 Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు టీమిండియా కొత్త కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ పదవిని తెలుగు ఆతడు తిలక్ వర్మను వారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం… 2026 టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే నిర్ణయంపై బీసీసీఐ ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. ఈ అంశంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ గురువారం ఆన్లైన్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు పేర్కొంది.
నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా నియమించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ఆమోదం లభించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్కు ఇప్పటికే సమాచారం ఇచ్చారట. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్యకుమార్ స్థానంలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ను కెప్టెన్గా నియమించాలని సూచించినట్లు సమాచారం. అయితే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదట. సెలెక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు కూడా సంజూ నిలకడైన ప్రదర్శనలు చేయలేకపోతున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. దీర్ఘకాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ఇంకా సమయం ఉందని పలువురు సెలెక్టర్లు భావించినట్లు సమాచారం. దీంతో శ్రేయస్ అయ్యర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో చోటు దక్కించుకోకపోయినా.. ఐపీఎల్లో తన నాయకత్వం, బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చిన అయ్యర్.. ఐపీఎల్ 2026లో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోకపోయినా.. అతడు 14 మ్యాచ్ల్లో 498 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అంతేకాకుండా భారత టీ20 జట్టులో నాలుగో స్థానంలో కూడా శ్రేయస్ అయ్యర్ను ఆడించే అవకాశమున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లను ఆర్సీబీకి అందించిన కెప్టెన్ రజత్ పాటిదార్కు భారత జట్టులో చోటుపై ఎలాంటి చర్చలు జరగలేదని సమాచారం. ఈ విషయాలపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ విషయంపై స్పష్టత రానుంది.
