Aakash Chopra Trolls Shreyas Iyer Captaincy: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు ఆగడం లేదు. సర్పంచ్ సాబ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై మాజీ భారత ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రశ్నలు లేవనెత్తాడు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ముందుగా జింబాబ్వేను 125/7 స్కోరుకే పరిమితం చేసి.. అనంతరం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ విజయానంతరం జట్టు కూర్పుపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. భారత్ కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగిందని పేర్కొన్నాడు. ‘ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ మాత్రమే స్పెసలిస్ట్ బౌలర్లు. ఐదో బౌలర్గా శివమ్ దూబేపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగడం చాలా రిస్కీ నిర్ణయం. అయితే దూబే టీమ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. సాధారణంగా బ్యాటింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన దూబేకు పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ బాధ్యత అప్పగించడం ద్వారా టీమ్ మేనేజ్మెంట్ అతనిపై ఎంత విశ్వాసం ఉంచిందో అర్థమవుతుంది’ అని అన్నాడు.
భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే వేగాన్ని ఆయుధంగా ఉపయోగించిందని ఆకాష్ చోప్రా విశ్లేషించాడు. ‘మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్లు పేస్ దాడితో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు . చాలా కాలం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన మయాంక్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. 150 కిలోమీటర్ల వేగానికి చేరువలో బంతులు వేయడానికి మయాంక్ ప్రయత్నించడం ఎంతో సంతోషంగా అనిపించింది. అశోక్ శర్మ కూడా కొన్ని పరుగులు ఇచ్చినా.. బాగా బౌలింగ్ చేశాడు. యువ పేసర్ల ప్రదర్శన భారత జట్టుకు భవిష్యత్తులో పెద్ద బలంగా మారే అవకాశముంది’ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
భారత్ తొలి మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్ కూర్పు, ముఖ్యంగా ఆరో బౌలర్ లేకపోవడం రాబోయే మ్యాచ్ల్లో ఎలా ప్రభావం చూపుతుందో చూడాలని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. జింబాబ్వేపై ఈ విజయం భారత జట్టుకు శుభారంభాన్ని అందించినప్పటికీ.. సిరీస్లో ముందుకు సాగే కొద్దీ జట్టు సమతుల్యత కూడా కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మరో బౌలర్ను తీసుకొని ఉండాల్సిందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

