ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద పడిన సమయంలో అతడికి ఏమైనా గాయం అయిందా… అందువల్లే గదిలో రక్తపు మరకలు ఏర్పడ్డాయా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే వార్న్ది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టులో థాయ్లాండ్ వైద్యులు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న కాంజెషినల్ డిసీజ్ వల్లే వార్న్ మరణించినట్లు పోస్టుమార్టం చెప్తోంది. ఈ రిపోర్టును వార్న్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని సమాచారం. కాగా మంగళవారం నాడు వార్న్ భౌతికకాయాన్ని థాయ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్తారు. మరోవైపు మరణానికి ముందు 14 రోజులుగా కేవలం ద్రవ రూపంలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే వార్న్ తీసుకున్నాడని.. ఈ డైట్ వార్న్ కొంపముంచిందని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు.
