అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన షకీబ్

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్‌లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న రికార్డును షకీబ్ బద్దలు కొట్టాడు.

Read Also: టీమిండియాలో రోహిత్ శర్మ స్పెషల్.. ఎందుకంటే..?

కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు చేతిలో ఉండగానే గెలిచింది. చరిత్ అసలంక (49 బంతుల్లో 80 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఇందులో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో ఆటగాడు రాజపక్స హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 171/4 స్కోరు చేసింది.