Saransh Jain to Replace Washington Sundar: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఈ వారంలోనే భారత టెస్టు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సెలెక్టర్లకు ప్రధాన సమస్యగా మారింది. హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న సుందర్.. సమయానికి పూర్తిగా ఫిట్గా ఉంటాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సుందర్ స్థానంలో టీమిండియాలోకి కొత్త ప్లేయర్ రానున్నాడని తెలుస్తోంది.
సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానుండటం దాదాపు ఖాయం. వీరిద్దరి రాకతో భారత జట్టు బౌలింగ్ బలోపేతం కానుంది. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, సౌరభ్ సుతార్, కుల్దీప్ యాదవ్లు జట్టులో కొనసాగనున్నారు. జట్టు కూర్పులో మరో ఆసక్తికర అంశం నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ రెడ్డి లేదా ప్రత్యేక బ్యాటర్కు అవకాశం దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
ఒకవేళ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమైతే.. అతని స్థానంలో కొత్త ఆటగాడు సారాంశ్ జైన్కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల సారాంశ్ శ్రీలంక ‘ఎ’ జట్టుతో ఇటీవల జరిగిన రెండు అనధికారిక టెస్టుల సిరీస్లో భారత్ ‘ఎ’ తరఫున ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే లోయర్ బ్యాటింగ్ చేయగలడు. 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 2223, 47 లిస్ట్ ఏ మ్యాచ్లలో 553, 21 టీ20లో 37 రన్స్ చేశాడు. అలానే వరుసగా 188, 38, 18 వికెట్స్ పడగొట్టాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్ బ్యాటింగ్ విభాగంలో ఎంపిక కానున్నారు.
శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్లో ఆటగాళ్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిద్ధమయ్యే అవకాశం ఉంది. అనంతరం జట్టు శ్రీలంకకు బయల్దేరి టెస్టు సిరీస్కు ముందు వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఈ సిరీస్ ఇరు జట్లకూ ఎంతో కీలకం. అందుకే సెలెక్టర్లు పటిష్ట జట్టును ఎంపిక చేయడంపై దృష్టి పెట్టారు. సుందర్ ఫిట్నెస్ నివేదిక వచ్చిన తర్వాతే తుది జట్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

